ఇటీవలి కాలంలో క్రికెట్లో అంపైరింగ్ తప్పిదాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. అంపైర్లు సరైన అవగాహన లేకుండా, తమకు తోచినట్లు నిర్ణయాలు ఇచ్చేయడాన్ని నెట్టింట ఫ్యాన్స్ ఎండగడుతున్నారు. ఇప్పుడు మరోసారి అలాంటి అంపైరింగ్ తప్పిదమే సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతోంది. అది కూడా ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్లో జరగడం గమనార్హం.
ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023 ఫైనల్లో ఈ తప్పు జరిగింది. ఈ టోర్నీ ఫైనల్కు ఇండియా-ఎ, పాకిస్తాన్-ఎ టీమ్స్ వచ్చాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ టీం ఏకంగా 352 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ లక్ష్యం అసాధ్యంగా కనిపించినా కూడా.. భారత్ వద్ద కూడా బలమైన బ్యాటింగ్ లైనప్ ఉండటంతో ఇండియా విజయంపై ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.

అందులోనూ టీమిండియా యంగ్ ఓపెనర్ సాయి సుదర్శన్ కచ్చితంగా ఈ మ్యాచ్లో రాణిస్తాడని అంతా అనుకున్నారు. ఎందుకంటే సెమీస్లో పాకిస్తాన్పై సాయి అదరగొట్టాడు. అద్భుతమైన శతకంతో ఆకట్టుకున్నాడు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం కేవలం 29 పరుగులకే అవుటయ్యాడు. అతను అవుటైన విధానమే ఇప్పుడు దుమారానికి దారితీసింది. పాక్ పేసర్ అర్షద్ ఇక్బాల్ బౌలింగ్లో కీపర్కు క్యాచ్ ఇచ్చిన సాయి పెవిలియన్ చేరాడు.
అయితే ఈ డెలివరీ వేసే సమయంలో అర్షద్ కాలు.. క్రీజుపై లేదు. అంటే ఇది నోబాల్ అన్నమాట. దీనిపై తర్జన భర్జనలు పడిన థర్డ్ అంపైర్ దీన్ని లీగల్ డెలివరీగా ప్రకటించి సాయిని అవుట్ అనేశాడు. ఈ నిర్ణయం ఫ్యాన్స్కు ఏమాత్రం నచ్చలేదు. ఇంత దారుణమైన అంపైరింగ్ చేస్తున్నా సరే.. అంపైర్లపై ఎలాంటి చర్యలు ఉండటం లేదని, అందుకే వాళ్లు ఇంత చెత్త నిర్ణయాలు ఇస్తున్నారని తిట్టిపోస్తున్నారు.
సాయి అవుటైన బంతి క్లియర్గా నోబాల్ అంటూ నెట్టింట ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు. ఇంత స్పష్టంగా అది నోబాల్ అని కనిపిస్తున్నా.. దాన్ని అవుట్ ఎలా ఇచ్చావంటూ అంపైర్ను నిలదీస్తున్నారు. ఇక ఈ మ్యాచ్లో ఓపెనర్ అభిషేక్ శర్మ (61), కెప్టెన్ యష్ ధుల్ (39) మినహా మిగతా బ్యాటర్లు విఫలమవడంతో భారత జట్టు చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే.