వర్షం ఆగిన వెంటనే ధవన్ అవుట్..
వర్షం తెరిపిన పడిన కాసేపటికే శిఖర్ ధవన్ (3) అవుటయ్యాడు. మ్యాట్ హెన్రీ వేసిన బంతికి భారీ షాట్ ఆడేందుకు ధవన్ ప్రయత్నించాడు. కానీ టైమింగ్ మిస్ అవడంతో గాల్లోకి లేచిన బంతిని మిడాన్లో ఉన్న లోకీ ఫెర్గూసన్ చాలా ఈజీగా క్యాచ్ చేశాడు. దీంతో ధవన్ నిరాశగా మైదానం వీడాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (34 నాటౌట్).. టీ20 తరహా బ్యాటింగ్ చేశాడు. మళ్లీ వర్షం పడే అవకాశం ఉండటంతో సాధ్యమైనంత ఎక్కువ స్కోరు చేసేందుకు ప్రయత్నించాడు. అతనికి శుభ్మన్ గిల్ (45 నాటౌట్) కూడా మంచి సహకారం అందించాడు.
వేగంగా ఆడిన సూర్య, గిల్
వీళ్లిద్దరూ వేగంగా ఆడటంతో భారత స్కోరుబోర్డు వేగంగా ముందుకు సాగింది. అయితే 12.5 ఓవర్లకు టీమిండియా స్కోరు 89/1గా ఉండగా మరోసారి భారీ వర్షం మొదలైంది. దీంతో ఆటగాళ్లు మళ్లీ మైదానం వీడి డగౌట్ చేరుకున్నారు. కాసేపు వర్షాన్ని గమనించిన అంపైర్లు అది తగ్గేలా కనిపించకపోవడంతో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇలా మ్యాచ్ మధ్యలో రద్దవడంపై రెండు జట్ల సారధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వాతావరణం మన చేతుల్లో ఉండదు కదా అని శిఖర్ ధవన్ చెప్పాడు. కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ ఇలా మ్యాచ్ రద్దవడం చాలా డిసప్పాయింటింగ్గా ఉందన్నాడు.
మూడో వన్డే కీలకం..
మూడు వన్డేల సిరీస్లో తొలి మ్యాచ్ గెలిచిన న్యూజిల్యాండ్ జట్టు 1-0 ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ రద్దవడంతో మూడో మ్యాచ్ మరింత కీలకంగా మారింది. తొలి వన్డేలో ధవన్, గిల్, శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్ రాణించారు.
దీంతో భారత జట్టు 306 పరుగుల భారీ స్కోరు చేసింది. కానీ టామ్ లాథమ్ (145 నాటౌట్), కేన్ విలియమ్సన్ (94 నాటౌట్) ఇద్దరూ అదరగొట్టడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. ఇక మూడో మ్యాచ్లో భారత్ గెలిచినా కూడా సిరీస్ డ్రా అవుతుందే కానీ.. భారత్ గెలిచే అవకాశం మాత్రం లేకుండా పోయింది.