ఐర్లాండ్తో జరిగిన రెండో టీ20లో భారత జట్టు ఘనవిజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో ఫీల్డింగ్ చేసే సమయంలో టీమిండియా వైస్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అందుకున్న ఒక క్యాచ్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ క్యాచ్ అందుకునే సమయంలో సహచర ఆటగాడు శివమ్ దూబేను గైక్వాడ్ ఢీకొట్టాడు.
అయినా సరే బంతిని వదలకుండా క్యాచ్ పూర్తి చేశాడు. ఐర్లాండ్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఈ ఘటన జరిగింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకన్న భారత జట్టు భారీ స్కోరు చేసింది. ఒక్క తిలక్ వర్మ (1) మినహా టీమిండియా బ్యాటర్లు అందరూ రాణించారు. దీంతో టీమిండియా 185 పరుగుల స్కోరు చేసింది.

లక్ష్య ఛేదనలో భారత్కు పేసర్లు మంచి ఆరంభం అందించారు. ఈ క్రమంలోనే ప్రసిద్ధ్ కృష్ణ వేసిన మూడో ఓవర్ చివరి బంతికి అతను షార్ట్ బాల్ వేశాడు. దాన్ని పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన ఐర్లాండ్ బ్యాటర్ టక్కర్ మిస్ అయ్యాడు. దీంతో గాల్లోకి లేచిన బంతి మిడాన్ ప్రాంతం వైపు వెళ్లింది.
దీన్ని అందుకోవడానికి రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే ఇద్దరూ దూసుకొచ్చారు. ఈ సమయంలో మిస్కమ్యూనికేషన్ కారణంగా వీళ్లిద్దరూ బలంగా ఢీకొన్నారు. అయినా సరే తన చేతిలో పడిన బంతిని గైక్వాడ్ వదలకుండా పట్టుకుకొనే ఉన్నాడు. దీంతో టక్కర్ పెవిలియన్ చేరాల్సి వచ్చింది.
ఇది చూసిన ఫ్యాన్స్ టెన్షన్ పడిపోయారు. వీళ్లిద్దరిలో ఎవరికైనా గాయం తగిలినా.. లేదంటే క్యాచ్ నేలపాలైనా టీమిండియాకే నష్టం జరిగేదని అంటున్నారు. ఇకపై అయినా ఈ చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లు కొంత జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు. ఇది ఐర్లాండ్ కోల్పోయిన రెండో వికెట్ కావడం గమనార్హం.
అంతకుముందు అదే ఓవర్ మూడో బంతికి ప్రసిద్ధ్ కృష్ణ తొలి వికెట్ తీసుకున్నాడు. ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ను అవుట్ చేశాడు. ఇలా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసుకున్న ప్రసిద్ధ్.. టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. ఐర్లాండో మరో ఓపెనర్ బల్బిర్నీ (72) హాఫ్ సెంచరీతో చెలరేగినా.. మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లేకపోవడంలో ఐర్లాండ్కు ఓటమి తప్పలేదు.