భారత్, ఐర్లాండ్ మధ్య జరిగిన తొలి టీ20లో వరుణుడు కీలక పాత్ర పోషించాడు. ఆకాశం ఫుల్లుగా మేఘావృతమై ఉండటంతో పిచ్ పరిస్థితులు కూడా మారిపోయాయి. ఇక రెండోసారి బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా తమ ఇన్నింగ్స్ పూర్తిగా కూడా ఆడలేకపోయింది. అయితే డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో విజయం సాధించింది. మరి రెండో టీ20లో కూడా ఇలాగ వాతావరణం కీలక పాత్ర పోషించనుందా?
తొలి టీ20 జరిగిన అదే డబ్లిన్ వేదికగా ఈ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇక్కడి పిచ్ ఎప్పుడూ బ్యాటర్లకు బాగా సహకరిస్తుంది. అయితే తొలి టీ20లో అలా జరగలేదు. పిచ్ కొంత ట్రిక్కీగా ఉండటంతో లో స్కోరింగ్ మ్యాచ్ జరిగింది. అలాగే రెండో టీ20 జరిగే సమయంలో కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

కాబట్టి రెండో టీ20 కూడా లో-స్కోరింగ్ మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఆదివారం నాడు ఇక్కడ వర్షం పడే అవకాశాలు దాదాపుగా లేవు. కానీ ఈ మ్యాచ్లో కూడా టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్ చేయడానికే మొగ్గు చూపుతుంది. ఎందుకంటే ఈ మైదానంలో జరిగిన 17 మ్యాచుల్లో పదింట్లో ఛేజింగ్ టీం విజయం సాధించింది.
రెండో టీ20లో కూడా స్పిన్నర్లు, పేసర్లకు పిచ్ నుంచి సహకారం లభించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ జరిగే సమయంలో ఉష్ణోగ్రతలు 16 డిగ్రీల సెల్సియస్ నుంచి 22 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని అంచనా. కానీ వర్షం పడే అవకాశం మాత్రం ఏమాత్రం లేదట. అయితే ఆకాశం మాత్రం మేఘావృతమై ఉంటుంది.
కాబట్టి పిచ్ నుంచి బౌలర్లకు కూడా సహకారం అందే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఈ మ్యాచ్ కూడా గెలిచి, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ తమ ఖాతాలో వేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. అదే సమయంలో రెండో టీ20 నెగ్గి సిరీసును మరింత థ్రిల్లింగ్గా మార్చాలని ఐర్లాండ్ అనుకుంటోంది.