ఐర్లాండ్తో జరిగిన రెండో టీ20లో టీమిండియా వైస్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ రాణించాడు. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ సందర్భంగా తనకు కొత్తగా దక్కిన వైస్ కెప్టెన్సీ గురించి గైక్వాడ్ మాట్లాడాడు. లీడర్షిప్ రోల్స్ చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయని అభిప్రాయపడ్డాడు.
'మహీ భాయ్ దీని గురించి ఎప్పుడూ చెప్తుంటాడు. ఒక్కో మ్యాచ్ ఆడుతూ పోవాలని అంటుంటాడు. ప్రస్తుతంలో ఉండాలని, ఫ్యూచర్ గురించి టెన్షన్ పడొద్దని చాలాసార్లు చెప్పాడు. చాలా మంది హైప్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ నేను అసలు సోషల్ మీడియానే చూడను' అని చెప్పుకొచ్చాడీ యంగ్ ఓపెనర్.

'మైదానంలో నా బెస్ట్ ఇస్తా. ఇంటికెళ్లి నా ఫ్రెండ్స్తో చిల్ అవుతా. నేను చెన్నై సూపర్ కింగ్స్లో నేర్చుకున్న విషయం ఇదే' అన్నాడు. అలాగే నాయకత్వం అంటే తను కాకుండా మిగతా పది మంది ప్లేయర్లకు పూర్తి కాన్ఫిడెన్స్ ఇవ్వడమే అని అభిప్రాయపడ్డాడు. వాళ్లలా ఆలోచించి మద్దతుగా నిలవాలని తెలిపాడు.
'వాళ్లు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారో తెలుసుకోవాలి. కొన్నిసార్లు బ్యాటర్లు, బౌలర్లు వాళ్ల ప్లాన్లు వాళ్లు వేసేసుకుంటారు. తమ దృష్టి నుంచి మ్యాచ్ను చూస్తుంటారు. ఆ క్షణంలో వాళ్లకు మద్దతుగా ఉండటం ముఖ్యం అని నా భావన. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఎక్కడ తప్పులు జరిగాయి? ఎక్కడ ఇంప్రూవ్ అవ్వొచ్చు అని చూసుకునే టైం ఉంటుంది' అని వివరించాడు.
అలాగే తన కెప్టెన్సీ ఎలా ఉంటుందో కూడా గైక్వాడ్ హింట్ ఇచ్చేశాడు. 'నాకు తెలిసి ఆటలో ప్లేయర్స్కు సాధ్యమైనంత స్వేచ్ఛ ఇవ్వాలి. వాళ్లపై వాళ్లకు నమ్మకం పెరిగేలా చేయాలి. మరీ ఎక్కువగా సజెషన్స్ ఇస్తే ప్లేయర్లు కన్ఫ్యూజ్ అయిపోతారు' అని చెప్పాడు. గైక్వాడ్ మాటలు విన్న చాలా మంది ఫ్యాన్స్.. తను ఫ్యూచర్లో మంచి కెప్టెన్ అవుతాడని అభిప్రాయపడుతున్నారు.