ఎన్నో కష్టాల నుంచి ఎదిగి ఇప్పుడు టీమిండియా అరంగేట్రం చేసిన ప్లేయర్లలో రింకూ సింగ్ ఒకడు. ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20లో అరంగేట్రం చేసినా అతనికి ఆడే అవకాశం రాలేదు. ఈ సందర్భంగా తన అరంగేట్రం గురించి మాట్లాడిన రింకూ సింగ్.. టీమిండియా కలర్స్లో తనను చూడాలనేది తల్లి కల అని చెప్పాడు.
ఇప్పుడు తను ఆ కలనే జీవిస్తున్నానని రింకూ చెపుకొచ్చాడు. 'ఈ అవకాశం కోసం నేను చాలా కష్టపడ్డాను. 10-12 ఏళ్ల క్రితం నేను క్రికెట్ ఆడటం మొదలు పెట్టా. అప్పుడే నేను దేశం తరఫున ఆడటమే లక్ష్యంగా పెట్టుకోవాలని అమ్మానాన్న చెప్పారు. ఐపీఎల్లో అవకాశం వచ్చినా వాళ్లు సంతోషించలేదు' అని తెలిపాడు.

'ఐపీఎలో ఎంతో మంది ఆడతారని, కానీ టీమిండియా అవకాశం చాలా కొద్దిమందికే వస్తుందని అమ్మానాన్న అనేవాళ్లు. అందుకే ఐపీఎల్లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని టీమిండియాకు ఎంపిక కావాలని కోరుకునే వాళ్లు. ఇప్పుడు వాళ్ల కల నెరవేరింది' అని రింకూ సంతోషం వ్యక్తం చేశాడు.
తను భారత జట్టుకు ఎంపికైనట్లు తెలిసినప్పుడు స్నేహితులతో కలిసి ఉన్నట్లు రింకూ గుర్తుచేసుకున్నాడు. 'నేను ఎంపికైనట్లు తెలియగానే మా అమ్మకు ఫోన్ చేసి చెప్పా. తను చాలా ఎమోషనల్ అయిపోయింది. అలా ఎమోషనల్గా అమ్మ మాట్లాడటం విని నా కళ్లలో కూడా నీళ్లు ఆగలేదు. ఈ క్షణం కోసం వాళ్లు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు' అని వెల్లడించాడు.
ఇలా భారత జట్టుకు ఎంపికవడం ద్వారా తన మొదటి కల నెరవేరిందని చెప్పిన రింకూ.. ఇక్కడి నుంచి మరిన్ని లక్ష్యాలు పెట్టుకొని ముందుకు సాగుతానని తెలిపాడు. 'జట్టుకు కావలసిన ఫలితాలు సాధించడానికి నా శక్తి మేరకు ప్రయత్నిస్తా. నూటికి నూరు శాతం శ్రమిస్తా. అలాగే సాధ్యమైనంత ఎక్కువ కాలం జట్టులో ఉండటానికి ప్రయత్నిస్తా' అని పేర్కొన్నాడు.