గాయం నుంచి కోలుకొని చాలాకాలం తర్వాత మళ్లీ టీమిండియాలోకి జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇచ్చాడు. ఐర్లాండ్తో జరుగుతున్న టీ20 సిరీసులో టీం కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. బుమ్రా కెప్టెన్సీలో ఈ సిరీస్ తొలి మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. వర్షం కారణంగా మధ్యలో ఆగిపోయిన ఈ మ్యాచ్ను డక్ వర్త్ లూయిస్ విధానంలో నెగ్గింది.
ఈ మ్యాచ్లో రీఎంట్రీ ఇచ్చిన బుమ్రా అదరగొట్టాడు. తొలి ఓవర్లోనే రెండు వికెట్లు తీసుకొని రాణించాడు. అయితే అతనికి కొద్దిలో ఒక ప్రమాదం తప్పింది. లేదంటే రీఎంట్రీలో మళ్లీ ఆస్పత్రి పాలవ్వాల్సి వచ్చేది. ఈ ఘటన డబ్లిన్ వేదికగా జరిగిన తొలి టీ20లో జరిగింది. ఐర్లాండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 14వ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ బంతి అందుకున్నాడు.

అతను వేసిన బంతిని బ్యాటర్ చక్కగా గ్యాప్లోకి ఆడాడు. దీన్ని బుమ్రా ఛేజ్ చేయడం మొదలు పెట్టాడు. అదే సమయంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న రవి బిష్ణోయి కూడా బౌండరీ ఆపేందుకు వేగంగా దూసుకొచ్చాడు. చివర్లో బంతిని అడ్డుకోవడానికి డైవ్ చేశాడు. సరిగ్గా అదే సమయానికి బుమ్రా కూడా బౌండరీ లైన్ వద్దకు వచ్చేశాడు.
వీళ్లిద్దరూ గట్టిగా ఢీకొట్టుకోవాల్సింది. కానీ బిష్ణోయి డైవ్ చేశాడు. దీంతో అతను తగిలి బుమ్రా బొక్కబోర్లా పడిపోయేవాడు. అయితే చివరి క్షణంలో అతనిపై నుంచి బుమ్రా జంప్ చేసి ప్రమాదం తప్పించుకున్నాడు. బిష్ణోయి డైవ్ చేసినా కూడా బౌండరీ ఆపలేకపోయాడు. కానీ ఆ తర్వాత బుమ్రా వైపు చూసి ఫన్నీగా నవ్వేశాడు.
ఇది చూసిన ఫ్యాన్స్ మాత్రం టెన్షన్తో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత కాలం తర్వాత జట్టులోకి వచ్చిన బుమ్రా.. ఆసియా కప్, వరల్డ్ కప్ వంటి టోర్నీల ముందు మళ్లీ గాయపడితే ఎలా? అని నిలదీస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా ఆడాలంటూ సలహాలు ఇస్తున్నారు.