టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇచ్చిన ఐర్లాండ్ సిరీస్లో భారత జట్టు శుభారంభం చేసింది. తొలి మ్యాచ్ను డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో తమ ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 139 పరుగులు మాత్రమే చేసింది. లక్ష్య ఛేదనలో భారత్కు మంచి ఆరంభమే లభించింది.
యశస్వి జైస్వాల్ (24) ఆకట్టుకోగా.. అతనికి జోడీగా వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ (19 నాటౌట్) కూడా ఫర్వాలేదనిపించాడు. అయితే జైస్వాల్, తిలక్ వర్మ (0) వరుస బంతుల్లో పెవిలియన్ చేరారు. ఇలాంటి సమయంలో క్రీజులోకి సంజూ శాంసన్ (1 నాటౌట్) వచ్చాడు. ఆ వెంటనే భారీ వర్షం ప్రారంభం అయింది.

దీంతో మ్యాచ్ నిలిపివేశారు. వర్షం ఆగేలా కనిపించకపోవడంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతితో టీమిండియా 2 పరుగుల తేడాతో నెగ్గినట్లు ప్రకటించాడు. ఈ విజయంపై టీమిండియా కెప్టెన్, 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' జస్ప్రీత్ బుమ్రా స్పందించాడు. మ్యాచ్లో రాణించినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు.
'ఎన్సీయేలో చాలా సెషన్లు బౌలింగ్ చేశా. నాకేదో కొత్త పని చేస్తున్నట్లు అనిపించడం లేదు. నా బౌలింగ్ క్వాలిటీ పడిపోకుండా ఎన్సీయే స్టాఫ్ చాలా సహకరించారు. మళ్లీ రీఎంట్రీ ఇచ్చినప్పుడు నెర్వస్గా ఏం లేదు. చాలా సంతోషంగా ఉంది. పిచ్పై కొంత స్వింగ్ ఉంది. దాన్ని యూజ్ చేసుకోవాలని అనుకున్నా' అని బుమ్రా చెప్పుకొచ్చాడు.
'అదృష్టం కొద్దీ టాస్ మేమే గెలిచాం. వాతావరణం ఇలా ఉండటం వల్ల కూడా కొంత సహకారం లభించింది. ప్రతి మ్యాచ్లో ఇంకా ఏదో చేయాలని అనుకుంటాం కదా. ఐర్లాండ్ కూడా బాగా ఆడింది. గెలిచినా కూడా కొన్ని విషయాల్లో మేం మెరుగవ్వాల్సి ఉంది. అందరూ చాలా కాన్ఫిడెంట్గా, బాగా ప్రిపేర్ అయ్యి ఉన్నారు' అని తెలిపాడు.
ఈ మ్యాచ్లో రింకూ సింగ్ అరంగేట్రం చేశాడు. అలాగే చాలా మంది ప్లేయర్లు కొంత గ్యాప్ తర్వాత మళ్లీ టీమిండియాకు వచ్చారు. అయినా సరే అందరూ బాగా ప్రిపేర్డ్గా ఉన్నారని బుమ్రా చెప్పాడు. ఐపీఎల్ కూడా వాళ్లకు హెల్ప్ అయిందని, తాము ఎక్కడికి వెళ్లినా టీంకు మద్దతు ఉంటుందని, అది కూడా ప్లేయర్లకు బాగా ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు.