టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు బ్యాడ్ న్యూస్. గతేడాది నుంచి వెన్ను నొప్పితో బాధ పడుతున్న బుమ్రా.. ఈ ఏడాది శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అనంతరం ఎన్సీయేలో చేరిన బుమ్రా నెమ్మదిగా కోలుకున్నాడు. అతని విషయంలో తొందర పడటం వల్ల టీంకు నష్టమే ఎక్కువ జరిగింది.
14 నెలల తర్వాత మళ్లీ టీమిండియా జెర్సీలో బుమ్రా ఆడేందుకు రెడీ అవుతున్నాడు. ఐర్లాండ్తో మూడు టీ20ల సిరీసులో అతనే జట్టుకు సారధ్యం వహిస్తున్నాడు. ఈ ఏడాది జరిగే ఆసియా కప్, వరల్డ్ కప్ రెండింట్లో బుమ్రా కీలకం కానున్నాడు. డబ్లిన్ వేదికగా జరిగే తొలి టీ20లో అతను ఎలా రాణిస్తాడని ఫ్యాన్స్ అంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

అయితే అతను ఫిట్గా ఉన్నాడా? లేదా? అని తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సి వచ్చేలా ఉంది. ఎందుకంటే ఐర్లాండ్తో టీమిండియా ఆడే మొదటి టీ20 వర్షార్పణం అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. డబ్లిన్ వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, మ్యాచ్ జరిగే రోజు 92 శాతం వర్షం పడే అవకాశం ఉంది.
దీంతో అసలు ఈ మ్యాచ్ జరుగుతుందా? అని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ మ్యాచ్ టికెట్లు పూర్తిగా అమ్ముడుపోయాయి. అంటే ఫ్యాన్స్ ఈ మ్యాచ్ చూసేందుకు ఎంత ఇంట్రస్ట్ చూపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కానీ వీళ్ల ప్లాన్స్ అన్నింటిపై వరుణ దేవుడు నీళ్లు కుమ్మరించేలా ఉన్నాడు.
ఈ సిరీసులో రెండో మ్యాచ్ కూడా ఇదే వేదికలో జరగనుంది. అయితే ఆదివారం జరిగే ఈ మ్యాచ్కు వాతావరణం వల్ల ఇబ్బంది ఉండదని వాతావరణ శాఖ అంచనా. ఆదివారం ఇక్కడ పూర్తిగా పొడి వాతావరణం ఉంటుందని అంటున్నారు. కానీ శుక్రవారం రోజు మాత్రం వర్షం తప్పేలా లేదు.