ఐర్లాండ్తో జరిగిన రెండో టీ20 కూడా నెగ్గిన భారత జట్టు సిరీస్ను తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్లో కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 15 పరుగులే ఇచ్చిన అతను రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ముఖ్యంగా ఈ మ్యాచ్లో బుమ్రా డెత్ బౌలింగ్ చూసిన ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు.
ఈ సిరీస్ మొదటి మ్యాచ్లో బుమ్రా బౌలింగ్ వేగం తగ్గింది. సాధారణం కన్నా కొంత నెమ్మదిగా అతను బౌలింగ్ చేశాడు. దీంతో బుమ్రా ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదేమో? అని కొన్ని అనుమానాలు తలెత్తాయి. అయితే వాటిని రెండో మ్యాచ్లోనే అతను పటాపంచలు చేశాడు. దీని గురించి మ్యాచ్ అనంతరం బుమ్రా కూడా మాట్లాడాడు.

తను పూర్తి ఫిట్గా ఉన్నానని, ఈ మ్యాచ్లో తన రన్నప్ వేగం, బౌలింగ్ వేగం కూడా పెరిగిందని చెప్పాడు. రెండో టీ20లో భారత బౌలర్లు అందరూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఐర్లాండ్ బ్యాటర్లు ఏ దశలోనూ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించలేదు. ఈ మ్యాచ్లో బుమ్రా ఒక్క బౌండరీ కూడా ఇవ్వకపోవడం గమనార్హం.
ఇన్నింగ్స్ చివరి ఓవర్ కూడా బుమ్రానే వేశాడు. ఆ ఓవర్ లాస్ట్ బాల్కు కీపర్ సంజూ శాంసన్ చేసిన పొరపాటుతో బైగా నాలుగు పరుగులు వచ్చాయి. అది తప్పితే ఒక్క బ్యాటర్ కూడా బుమ్రా బౌలింగ్లో బౌండరీ కొట్టలేకపోయాడు. డెత్ ఓవర్లలో అయితే తన మార్క్ యార్కర్లతో బుమ్రా చెలరేగాడు. ఇలా బుమ్రా అదిరిపోయే బౌలింగ్ చేయడం చూసిన ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు.
'ఇది బుమ్రా మాస్టర్ క్లాస్' అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. డెత్ బౌలింగ్ ఇలా కదా వేయాలి అని అంటున్నారు. బుమ్రా కంబ్యాక్ ఇలా ఉండాలని మరికొందరు చెప్తున్నారు. ఏదేమైనా బుమ్రా ఇదే జోరు కొనసాగిస్తే వరల్డ్ కప్లో కూడా టీమిండియాకు చాలా కలిసొస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.