వెన్నుగాయం నుంచి కోలుకున్న టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా.. మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు రెడీ అయ్యాడు. ఐర్లాండ్తో మూడు టీ20ల సిరీసులో భారత జట్టుకు సారధ్య బాధ్యతలు చేపట్టాడు. శుక్రవారం నాడు తొలి టీ20 జరగనున్న నేపథ్యంలో మీడియాతో బుమ్రా మాట్లాడాడు.
తిరిగి క్రికెట్ ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా బుమ్రా చెప్పాడు. 'ఎన్సీయేలో చాలా కష్టపడ్డా. మళ్లీ తిరిగొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా మైదానంలో దిగేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నా' అని చెప్పుకొచ్చాడీ స్టార్ పేసర్. వెన్నుగాయం నుంచి కోలుకున్న తర్వాత ఎన్సీయేలో చాలాకాలం పాటు అతను బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు.

మ్యాచ్ ఫిట్నెస్ సాధించేందుకు చాలా కష్టపడ్డాడు. ప్రస్తుతం తాను పూర్తిగా కోలుకున్నానని, ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పూర్తి సామర్ధ్యంతో బౌలింగ్ చేస్తానని చెప్పాడు. ఐర్లాండ్తో జరిగే మూడు టీ20 మ్యాచుల సిరీసును.. ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్కు సన్నాహకంగా భావిస్తున్నట్లు తెలిపాడు.
'చాలా గ్యాప్ తర్వాత నేను మళ్లీ ఆడుతున్నా. వచ్చీరాగానే అద్భుతంగా ఆడేయాలని, ఒంటి చేత్తో మ్యాచులు గెలిపిస్తానని అనుకోవడం లేదు. నాపై అలాంటి అంచనాలు ఉంటే.. అది పూర్తిగా వాళ్ల ఇష్యూ. నాకు సంబంధం లేదు' అని చెప్పేశాడు. తను పూర్తిగా తన ఆటను ఎంజాయ్ చేస్తానని అన్నాడు.
తనపై తనకు చాలా తక్కువ అంచనాలతోనే బరిలో దిగుతున్నట్లు చెప్పాడు. 'నాపై నేను మరీ ఎక్కువ ఒత్తిడి పెట్టుకోవాలని అనుకోవట్లేదు. ప్రస్తుతం నా ఆటను ఎంజాయ్ చేయడమే నా లక్ష్యం. మరీ ఎక్కువగా అంచనాలు పెట్టుకొని ఇబ్బంది పడటం ఇష్టం లేదు' అని స్పష్టం చేశాడు. ఐర్లాండ్ సిరీసులో బుమ్రా ఆటను బట్టే అతన్ని ఆసియా కప్కు ఎంపిక చేస్తారని వార్తలు వస్తున్నాయి.