టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా తాజాగా మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. గాయం కారణంగా చాలా కాలం అతను ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. సుమారు 11 నెలల తర్వాత మళ్లీ ఇప్పుడు కోలుకున్న బుమ్రా.. ఐర్లాండ్పై పునరాగమనం చేశాడు. రీఎంట్రీలో సత్తా చాటుతున్నాడు.
అయితే ఈ సిరీసులో ఇప్పటి వరకు బుమ్రా ఆడిన రెండు మ్యాచులు గమనిస్తే.. ఒక విషయం ఫ్యాన్స్కు ఆశ్చర్యం కలిగిస్తుంది. అదేంటంటే.. బుమ్రా బౌలింగ్ యాక్షన్. రెండో టీ20లో అద్భుతమైన బౌలింగ్తో తనలో ఏమాత్రం సత్తా తగ్గలేదని బుమ్రా నిరూపించుకున్నాడు. అయితే తన బౌలింగ్ యాక్షన్, రన్నప్ను మార్చుకున్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20లో బుమ్రా తన నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేశాడు. ఈ మ్యాచ్లో 24 పరుగులు ఇచ్చిన అతను రెండు వికెట్లు తీసుకున్నాడు. అయితే అతని బౌలింగ్లో కొంత పదును తగ్గినట్లు కనిపించింది. కానీ రెండో మ్యాచ్లో ఈ అనుమానాలు అన్నీ పటాపంచలయ్యాయి.
తనదైన స్టైల్లో బౌలింగ్ చేసిన బుమ్రా.. యార్కర్లతో చెలరేగాడు. రెండో మ్యాచ్లో తన బౌలింగ్లో ఒక్కటంటే ఒక్క బౌండరీ కూడా ఇవ్వలేదు. దీని గురించి ఒక ఎన్సీయే అధికారి ఆశ్చర్యకర విషయం వెల్లడించాడు. బుమ్రా తన బౌలింగ్ యాక్షన్లో మార్పులు చేసినట్లు సదరు అధికారి తెలిపాడు. దీని వెనుక కీలకమైన కారణం కూడా ఉందన్నాడు.
'గాయంతో బుమ్రా ఆటకు దూరం అవడానికి ముందు అతని బౌలింగ్ యాక్షన్ గమనించండి. బౌలింగ్ చేసే ముందు ఆరు, ఏడు అడుగులు వేస్తాడు. అప్పుడు లోడప్ అవుతాడు. తన ఏడో అడుగు నుంచి వేగంగా వచ్చి నిప్పులు చెరిగే బంతులు వేసేవాడు' అని సదరు అధికారి వెల్లడించాడు.
'అదే ఐర్లాండ్పై అతని బౌలింగ్ చూడండి. బుమ్రా తన రన్నప్ను ఒక 2-3 అడుగులు పెంచినట్లు ఈజీగా అర్థం అవుతుంది. ఆ తర్వాత మరింత పెద్ద ఫాలో త్రూ కూడా కనిపిస్తుంది. అతని బౌలింగ్ యాక్షన్లో మరీ భారీగా మార్పులు రాలేదు. కానీ ఈ చిన్న మార్పుల వల్ల అతను అంత త్వరగా గాయపడటం జరగదు' అని వివరించాడు.