డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం టీమిండియా గట్టిగా రెడీ అయింది. వారం రోజుల ముందుగానే ఇంగ్లండ్ చేరుకున్న భారత ఆటగాళ్లు తమ ఆటకు తుది మెరుగులు దిద్దుకున్నారు. అదే సమయంలో జట్టు ఎంపికపై కొంత చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఓవల్ పిచ్ ఫొటోలు చూసిన చాలా మంది ఇద్దరు స్పిన్నర్లతో ఈ పిచ్పై బరిలో దిగడం అనవసరం అని అంటున్నారు.
ఈ క్రమంలో అశ్విన్ను టీమిండియా పక్కన పెట్టేస్తుందని, కేవలం జడేజానే స్పిన్నర్ బాధ్యతలు నిర్వర్తిస్తాడని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇలాంటి సమయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ విషయంపై స్పందించాడు. 'నేను అశ్విన్ ఆడటం లేదని ఎవరికైనా చెప్పానా? ఆ మాటలే నేను అనలేదు. మ్యాచ్ ముందు ఈ విషయంపై డెసిషన్ తీసుకుంటాం' అని చెప్పాడు.

ఓవల్ పిచ్ రోజు రోజుకూ మారిపోతుందని, రోజులు గడిచే కొద్దీ స్లోగా మారుతుందని రోహిత్ తెలిపాడు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జట్టు ఎంపిక చేస్తామన్నాడు. ఇక్కడి పిచ్ ఒక రోజు బాగానే ఉంటే.. మరుసటి రోజుకే లైట్గా మారిపోతుందని రోహిత్ చెప్పాడు. అందుకే భారత బృందంలోని 15 మంది ఆడేందుకు రెడీగా ఉండాలని రోహిత్ సూచించాడు. ఇవి ఛాలెంజింగ్ కండిషన్స్ అని, కాబట్టి అందరూ సిద్ధంగా ఉండాలని అన్నాడు.
'ఈరోజు పిచ్ ఇలా ఉంది. రేపు ఇంకోలా ఉంటుంది. కొంచెం మారిపోతుంది. అందుకే మా కుర్రాళ్లకు క్లియర్గా ఒక మెసేజ్ ఇచ్చాం. బృందంలోని 15 మంది అందరూ ఎప్పుడు పిలిచినా ఆడేందుకు రెడీగా ఉండాలి' అని రోహిత్ వివరించాడు. అదే సమయంలో ఓవల్ పిచ్ నుంచి పేసర్లకు ఎక్కువ సహకారం లభిస్తుందని కూడా అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో మ్యాచ్ జరిగే కొద్దీ పిచ్ మరిం మెరుగవుతుందని చెప్పాడు.
రోజులు గడిచేకొద్దీ ఈ పిచ్ మరింత నెమ్మదిస్తుందని రోహిత్ తెలిపాడు. దాన్ని దృష్టిలో ఉంచుకొని తాము జట్టును ఎంపిక చేసుకుంటామని తేల్చిచెప్పాడు. 'నేను కూడా పిచ్ చూశా. చూస్తుంటే కొంచెం సీమర్ ఫ్రెండ్లీ పిచ్లా ఉంది. వాతావరణం కూడా బాగుంది. కాబట్టి పేసర్లు రాణిస్తారని అనుకుంటున్నా. పిచ్ మారుతుందని తెలుసు కానీ.. మరీ భారీగా మారిపోతుందా? అని తెలీదు' అన్నాడు.
టీమిండియా చివరగా ఓవల్లో ఆడినప్పుడు కూడా పిచ్ ఇలాగే ఉందని రోహిత్ గుర్తుచేసుకున్నాడు. అయితే ఆట జరిగే కొద్దీ పిచ్ మెరుగవుతూ వచ్చిందని, పిచ్ నెమ్మదించడం మొదలైందని వివరించాడు. అప్పుడే రివర్స్ స్వింగ్ కూడా బౌలర్లకు దక్కిందని చెప్పాడు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని జట్టు ఎంపిక ఉంటుందని స్పష్టం చేశాడు.