టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ మళ్లీ తన పూర్వపు ఫామ్ అందుకున్నట్లే కనిపిస్తున్నాడు. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత విజయంలో అతను కీలక పాత్ర పోషిస్తాడని నిపుణులు చెప్తున్నారు. అదే సమయంలో ఈ మ్యాచ్లో మూడు రికార్డులు బద్దలు కొట్టేందుకు కోహ్లీ ఎదురు చూస్తున్నాడు. అవేంటంటే..
సెహ్వాగ్ను దాటేస్తాడా?: కోహ్లీ ఇప్పటి వరకు 108 టెస్టు మ్యాచుల్లో 8416 పరుగులు చేశాడు. తను కనుక డబ్ల్యూటీసీ ఫైనల్లో 125 పరుగులు చేస్తే.. విండీస్ దిగ్గజం, కోహ్లీ ఫేవరెట్లలో ఒకడైన సర్ వివియన్ రిచర్డ్స్ రికార్డు బద్దలు కొడతాడు. రిచర్డ్స్ తన టెస్టు కెరీర్లో 8540 పరుగులు చేశాడు. ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశం కోహ్లీ ముందు ఉంది.

అలాగే ఈ మ్యాచ్లో కనుక కోహ్లీ 171 పరుగులు చేస్తే.. టీమిండియా లెజెండరీ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ను దాటేస్తాడు. సెహ్వాగ్ తన టెస్టు కెరీర్లో 8586 పరుగులు చేశాడు. ఈ రికార్డు బద్దలు కొట్టడం కొంచెం కష్టమే. కానీ మంచి టచ్లో కనిపిస్తున్న కోహ్లీ దీన్ని బ్రేక్ చేసినా ఆశ్చర్యం లేదు.
ద్రావిడ్ రికార్డుపై కన్ను: ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పేరిట ఉన్న రికార్డుపై కూడా కోహ్లీ కన్ను పడింది. ఆస్ట్రేలియాపై అద్భుతంగా రాణించిన భారత బ్యాటర్లలో ద్రావిడ్ ఒకడు. అతను 60 ఇన్నింగ్సుల్లో 13 హాఫ్ సెంచరీలు, రెండు సెంచరీల సాయంతో 2143 పరుగులు చేశాడు.
కోహ్లీ ఇప్పటి వరకు ఆస్ట్రేలియాపై 42 ఇన్నింగ్సుల్లో 1979 పరుగులు చేసి ఉన్నాడు. ఆసీస్పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్లో 164 పరుగులు చేస్తే ద్రావిడ్ను దాటేస్తాడు.
పాంటింగ్ను దాటేస్తాడా?: ఆస్ట్రేలియా లెజెండరీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరిట ఉన్న రికార్డును కూడా కోహ్లీ అధిగమించే అవకాశం ఉంది. అతనే కాదు.. ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవెన్ స్మిత్ కూడా ఈ రికార్డు సాధించొచ్చు. భారత్, ఆస్ట్రేలియా సిరీసుల్లో అత్యధిక సెంచరీలు బాదిన ప్లేయర్ల జాబితాలో 11 శతకాలతో సచిన్ అగ్రస్థానంలో ఉన్నాడు.
రెండో స్థానంలో 8 సెంచరీలతో రికీ పాంటింగ్ ఉన్నాడు. కోహ్లీ, స్మిత్ కూడా ఎనిమిదేసి శతకాలు చేసి ఉన్నారు. ఈ మ్యాచ్లో కనుక వీళ్లిద్దరిలో ఎవరు సెంచరీ చేసినా వాళ్లు పాంటింగ్ను దాటేసే ఛాన్స్ ఉంది. అయితే సచిన్ రికార్డు బద్దలు కొట్టడం మాత్రం ఇప్పుడప్పుడే వాళ్లకు కుదరకపోవచ్చు.