ఉరుము ఉరిమి మంగలం మీద పడిందనే సామెత ఉంది కదా. డబ్ల్యూటీసీ ఫైనల్ చూసిన ఫ్యాన్స్కు ఒకానొక సమయంలో అదే విషయం గుర్తొచ్చింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తాము ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. పిచ్ పరిస్థితిని చూసే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు.
అయితే ఆ నిర్ణయం తీవ్రంగా బెడిసి కొట్టింది. భారత బౌలర్లు అందరూ తేలిపోయారు. ఆరంభంలో బంతిని కొంత స్వింగ్ చేసిన షమీ, సిరాజ్ ఫర్వాలేదనిపించారు. ఉస్మాన్ ఖవాజా (0)ను సిరాజ్ డకౌట్ చేశాడు కూడా. ఆ తర్వాత డేవిడ్ వార్నర్ (43), మార్నస్ లబుషేన్ (26) ఫర్వాలేదనిపించారు. ఇక ఆ తర్వాత భారత బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేదు.

ట్రావిస్ హెడ్ (146 నాటౌట్), స్టీవ్ స్మిత్ (95 నాటౌట్) అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో ఆ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 327/3 స్కోరుతో ఆధిక్యంలో నిలిచింది. మూడు వికెట్లు తీసిన తర్వాత భారత బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ చాలా చిరాకు పడ్డాడు. ఇన్నింగ్స్ 39వ ఓవర్ వేస్తున్న సమయంలో అతని చేసిన పని వైరల్ అవుతోంది.
రవీంద్ర జడేజా ఈ ఓవర్ వేయడానికి రెడీ అవుతున్న సమయంలో.. రోహిత్ పక్కనే ఉన్నాడు .ఆ సమయంలో తమ బౌలర్లను ఉద్దేశించి 'ఏంటయ్యా మీరు?' (క్యా యార్ తుమ్ లోగ్) అంటూ అటుగా ఉన్న బౌలర్ల వైపు చేతులు చూపించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఇలా సొంత బౌలర్లపై ప్రతాపం చూపిస్తే ప్రయోజనం ఉండదని, సరైన స్ట్రాటజీలతో బ్యాటర్లను కట్టడి చేయాలని రోహిత్కు ఫ్యాన్స్ హితబోధ చేస్తున్నారు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ను కంట్రోల్ చేయడంలో టీమిండియా విఫలమవడాన్ని విమర్శిస్తున్నారు. మరి రెండో రోజు టీమిండియా బౌలర్లు ఏం చేస్తారో చూడాలి.