ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత జట్టు వెనుకంజలో ఉంది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఆధిపత్యంలో నిలిచింది. భారత బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేదు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ (146 నాటౌట్)ను నిలువరించడంలో టీమిండియా పేసర్లు తేలిపోయారు. అయితే తొలిరోజు ఆట చివర్లో షార్ట్ బాల్స్తో అతన్ని కొంత ఇబ్బంది పెట్టారు.
ఇలా షార్ట్ బాల్స్ ఆడటంలో ట్రావిస్ హెడ్ ఇబ్బంది పడటం చూసిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. ఇదేదో అతను బ్యాటింగ్కు వచ్చినప్పటి నుంచే చేసి ఉంటే మ్యాచ్ చేజారేది కాదంటూ టీమిండియా వ్యూహాలను తిట్టిపోస్తున్నారు. ఇదే విషయాన్ని భారత బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే కూడా అంగీకరించాడు ట్రావిస్ హెడ్పై ముందుగానే షార్ట్ బాల్ ప్లాన్ ప్రయోగించాల్సింది అన్నాడు.

ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఆరంభంలో షమీ, సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. కానీ ట్రావిస్ హెడ్తోపాటు స్టీవ్ స్మిత్ (95 నాటౌట్) కూడా చెలరేగడంతో నెమ్మదిగా మ్యాచ్ భారత్ చేయి దాటిపోయింది. వీళ్లిద్దరూ నాలుగో వికెట్కు ఏకంగా 251 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలోనే ట్రావిస్ హెడ్ను షార్ట్ బాల్స్తో ముందుగానే ఇబ్బంది పెట్టొచ్చుగా అని ఫ్యాన్స్ అంటున్నారు.
'ట్రావిస్ హెడ్ను షార్ట్ బాల్స్తో ఇబ్బంది పెట్టొచ్చు అని మేం ముందు నుంచి అనుకుంటూనే వచ్చాం. నిజమే.. ఈ ట్యాక్టిక్ను ఒక 30-40 పరుగుల ముందే ఉపయోగించి ఉంటే బాగుండేది. కానీ ఇలాంటి విషయాల్లో కెప్టెన్ను నమ్మాల్సి ఉంటుంది. అతనికి ఏం అనిపిస్తే అదే చేయడం మంచిది. ఈ స్ట్రాటజీ వాడటానికి అది సరైన సమయం కాదని తను అనుకున్నాడేమో?' అని పరాస్ మాంబ్రే అన్నాడు.
అయితే తను మాత్రం ఈ స్ట్రాటజీని కొంచెం ముందుగానే తీసుకొచ్చి ఉంటే బాగుండేదని అనుకున్నట్లు స్పష్టం చేశాడు. 'రెండో బాల్ తీసుకున్న తర్వాత కొంచెం సీమ్ లభిస్తోంది. కట్ కూడా దొరుకుతోంది. కాబట్టి కచ్చితంగా రెండో రోజు తొలి సెషన్ మాకు చాలా కీలకం అని అనుకుంటున్నా. ఈ సెషన్లో కొన్ని వికెట్లు తీసుకుంటే మ్యాచ్ మళ్లీ మా చేతుల్లోకి వస్తుంది' అని మాంబ్రే వివరించాడు.