ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే చాలు విరాట్ కోహ్లీ చెలరేగుతాడు. క్వాలిటీ టీంతో ఆడేటప్పుడు క్వాలిటీ షాట్లు ఆడే ప్లేయర్లే పరుగులు చేయగలుగుతారు. కోహ్లీ అదే చేస్తాడు. అందుకే ఆసీస్పై కోహ్లీ రికార్డు అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు ఆసీస్పై 24 మ్యాచులు ఆడిన అతను 48.26 సగటుతో 1979 పరుగులు చేశాడు. ఇదే విషయాన్ని మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా చెప్పాడు.
ఆసీస్తో మ్యాచ్ ఉన్న రోజున కోహ్లీ నిద్ర లేవడమే డిఫరెంట్గా లేస్తాడని రవిశాస్త్రి చెప్పాడు. కోహ్లీ వంటి ప్లేయర్ కనుక రాణిస్తే.. ఆసీస్ బౌలర్లపై చాలా ఒత్తిడి పెరుగుతుందని శాస్త్రి అన్నాడు. 'ఆసీస్తో మ్యాచ్ ఉన్న రోజున కోహ్లీ తేడాగా లేస్తాడు. కొంచెం ముందే కాఫీ స్మెల్ చేస్తాడు. అతను కనుక తడబడకుండా 20 స్కోరు చేశాడంటే.. ఇక అతన్ని ఆపడం కష్టం. అప్పుడు ఆట మజాగా ఉంటుంది' అని శాస్త్రి తెలిపాడు.

దాదాపు మూడేళ్లపాటు ఫామ్లో లేని కోహ్లీ.. గతేడాది ఆసియా కప్ సమయంలో మళ్లీ ఫామ్ అందుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం అతనికి రాలేదు. వన్డేల్లో కూడా సెంచరీ ఎదురు చూపులకు ఫుల్స్టాప్ పెట్టాడు. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి మ్యాచ్లో ఆసీస్పై భారీ శతకంతో టెస్టుల్లో 1205 రోజుల తర్వాత శతకం బాదాడు. ఇది అతని కెరీర్లో 28వ సెంచరీ కావడం గమనార్హం.
ఆ తర్వాత ఐపీఎల్లో కూడా అద్భుతమైన ఫామ్ కనబరిచిన కోహ్లీ.. ఈ లీగ్లో తను ఆడిన చివరి రెండు మ్యాచుల్లో వరుస శతకాలతో అదరగొట్టాడు. ఇదే ఫామ్ కనుక డబ్ల్యూటీసీ ఫైనల్లో కోహ్లీ కొనసాగిస్తే.. పదేళ్లుగా ఐసీసీ ట్రోఫీ కోసం టీమిండియా ఎదురు చూపులకు కూడా బ్రేక్ పడటం ఖాయం. అయితే ఓవల్లో పరిస్థితులు చాలా ఛాలెంజింగ్గా ఉంటాయని, వాటికి త్వరగా అలవాటు పడిన జట్టే గెలుస్తుందని కోహ్లీ చెప్పిన సంగతి తెలిసిందే.