దశాబ్దంపైగా ఐసీసీ ట్రోఫీ నెగ్గని భారత జట్టు.. ఈసారి డబ్ల్యూటీసీ ఫైనల్ ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది. ఓవల్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఓడించేందుకు రెడీ అవుతోంది. డబ్ల్యూటీసీ 2021-2023 సైకిల్ పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఈ జట్టు ట్రోఫీ కోసం తలపడుతున్నాయి.
ఈ సైకిల్లో 11 విజయాలు సాధించిన ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలవగా.. 10 విజయాలతో భారత జట్టు రెండో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. టెస్టు క్రికెట్లో తమ ఆధిపత్యం చెలాయించడానికి రెండు జట్లకు డబ్ల్యూటీసీ ఫైనల్ ఒక సువర్ణావకాశం. ఇది గెలిచి సుదీర్ఘ ఫార్మాట్లో టాప్గా నిలిచేందుకు భారత్, ఆస్ట్రేలియా ప్రయత్నిస్తున్నాయి.

ఈ మ్యాచ్ కోసం తయారు చేసిన పిచ్ కూడా ఆసక్తికరంగా ఉంది. మంచి పేస్, బౌన్స్తోపాటు పేసర్లకు స్వింగ్ కూడా లభించేలా పిచ్ను తయారు చేశారు. ఇంగ్లండ్లో జూన్ నెలలోనే వేసవి మొదలవుతుంది. కాబట్టి ఈ పిచ్పై చివరి రెండు రోజుల్లో స్పిన్నర్లు కూడా బాగా ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అశ్విన్, జడేజా ఇద్దర్నీ భారత్ బరిలో దింపుతుందా? అని చర్చ జరుగుతోంది.
ఇక వాతావరణం విషయానికి వస్తే.. ఎండాకాలం మొదలైన నేపథ్యంలో లండన్ వాతావరణం చాలా క్లియర్గా ఉంటుందని వాతావరణ శాఖ చెప్తోంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు 11 డిగ్రీల నుంచి 22 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని సమాచారం. అలాగే ఎలాంటి వర్షం పడే అవకాశం లేదని, ఆకాశం నిర్మలంగా ఉంటుందని చెప్తోంది. అయితే మ్యాచ్ చివరి రెండ్రోజుల్లో జల్లులు పడే అవకాశం ఉంది.
ఈ కారణంగానే జూన్ 12ను రిజర్వ్ డేగా ఐసీసీ నిర్ణయించింది. వర్షం వల్ల కానీ, మరేదైనా కారణం వల్ల కానీ మ్యాచ్ సరిగా జరగని పక్షంలో రిజర్వ్ డే నాడు మ్యాచ్ కొనసాగుతుంది. లేదంటే ఐదు రోజుల్లో వచ్చిన ఫలితమే ఫైనల్. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ డ్రా కాకుండా ఫలితం వచ్చేలా చూడాలని, ఫలితం వస్తేనే బాగుంటుందని పలువురు నిపుణులు అంటున్నారు.