డబ్ల్యూటీసీ ఫైనల్ గెలవాలంటే భారత జట్టు చాలా కష్టపడాల్సి వచ్చేలా ఉంది. ఓవల్ పిచ్కు సంబంధించిన తాజాగా బయటకు వచ్చిన ఫొటోలు చూస్తే ఇక్కడ భారత బ్యాటింగ్ లైనప్ చెమటోడ్చాల్సి వచ్చేలా కనిపిస్తుంది. ఈ స్టేడియంలో స్పిన్నర్లు కూడా ప్రభావం చూపుతారని ముందు నుంచి నిపుణులు చెప్తూ వస్తున్నారు.
కానీ పిచ్ చూస్తే ఇది పూర్తిగా పేస్ బౌలింగ్ పిచ్ అని తెలిసిపోతోంది. పిచ్ నిండా గడ్డి కూడా ఉండటంతో స్వింగ్ బౌలింగ్కు ఇది చాలా సహకారం అందిస్తుందని తెలుస్తోంది. అదే జరిగితే బలమైన బౌలింగ్ ఉన్న ఆస్ట్రేలియా టీం మరింత సంతోషించడం ఖాయంగా అనిపిస్తోంది. అయితే భారత్ వద్ద కూడా మంచి పేసర్లే ఉన్నారు.

కానీ జస్ప్రీత్ బుమ్రా వంటి ఏస్ పేసర్ లేకపోవడంతో భారత్ ఈ మ్యాచ్ గెలవడం కొంచెం కష్టమే అని కొందరు నిపుణులు చెప్తున్నారు. ఈ పిచ్ చూసిన తర్వాత భారత విజయావకాశాలు మహమ్మద్ షమీ, సిరాజ్ చేతుల్లోనే ఉన్నాయని స్పష్టంగా తెలిసిపోతోంది. ఇంగ్లండ్లోని స్వింగ్ కండిషన్స్లో గతంలో భారత ఆటగాళ్లు చాలా ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే.
ఈ పిచ్ చూసిన తర్వాత భారత జట్టులో సెలెక్షన్ సమస్య కూడా వచ్చింది. ఇప్పటి వరకు అశ్విన్, జడేజా ఇద్దర్నీ ఆడించాలని టీమిండియా థింక్ ట్యాంక్ భావించింది. కానీ పిచ్ పూర్తిగా పేస్ ఫ్రెండ్లీ కావడంతో ఈ ఆలోచనను చెత్తబుట్టలో పడేయక తప్పదు. అశ్విన్ను పక్కన పెట్టేసి నలుగురు పేసర్లతో బరిలో దిగితే మంచిదని పిచ్ చూసిన వాళ్లు చెప్తున్నారు. అదే జరిగితే భారత ఏకైక స్పిన్నర్గా రవీంద్ర జడేజా రాణించాల్సి ఉంటుంది.
ఈ పిచ్పై భారత్కు శుభారంభం అందించాల్సిన అవసరం ఓపెనర్లపై ఉంటుంది. గిల్ మంచి ఫామ్లోనే ఉన్నా.. రోహిత్ ఫామ్పై కొంత ఆందోళన నెలకొంది. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ను ఆరంభంలో రోహిత్ ఎలా ఎదుర్కొంటాడనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఆ టీం స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్ కూడా గాయంతో మ్యాచ్కు దూరమైన సంగతి తెలిసిందే. ఇది భారత ఫ్యాన్స్కు కొంత ఊరటనిచ్చే అంశం.