ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత జట్టు తడబడుతోంది. ఓవల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ నుంచి బౌలర్లకు సహకారం అందుతుందని భావించిన రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. కానీ భారత బౌలర్లు ఏమాత్రం రాణించకపోవడంతో ఈ నిర్ణయం బెడిసికొట్టింది.
ఈ క్రమంలోనే రవిచంద్రన్ అశ్విన్ను సెలెక్ట్ చేయకపోవడం కూడా భారత్ చేసిన తప్పేనని టీమిండియా లెజెండ్ సునీల్ గవాస్కర్ అన్నాడు. ఆస్ట్రేలియాపై అశ్విన్కు అద్భుతమైన రికార్డు ఉంది. కంగారూలపై 22 మ్యాచులు ఆడిన అతను 114 వికెట్లు తీసుకున్నాడు. అశ్విన్ కోసం ఉమేష్ యాదవ్ వంటి బౌలర్ను పక్కన పెట్టాల్సిందని అన్నాడు.

'ఆస్ట్రేలియా టీంలో లెఫ్ట్ హ్యాండర్లను అశ్విన్ బాగా ఇబ్బంది పెట్టేవాడు. తను నెంబర్ వన్ టెస్టు బౌలర్. అలాంటి ప్లేయర్ల విషయంలో పిచ్ గురించి పట్టించుకోవడం కరెక్ట్ కాదు' అని గవాస్కర్ చెప్పాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడుతూ వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ను పక్కన పెట్టడం ఏంటో అర్థం కావడం లేదన్నాడు.
'మీరు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడుతున్నారు. ఈ మ్యాచ్లో నెంబర్ వన్ టెస్టు బౌలర్ను ఎందుకు తీసుకోలేదు? ఆ నిర్ణయం వెనుక ఎలాంటి రీజనింగ్ ఉందో నాకు అసలు అర్థమే కావడం లేదు. సరైన రిథమ్ లేక, అంతగొప్పగా రాణించని ఉమేష్ యాదవ్ స్థానంలో నేనైతే అశ్విన్ను కళ్లు మూసుకొని తీసుకునేవాడిని' అని గవాస్కర్ స్పష్టం చేశాడు.
'ఆసీస్ టీంలో నలుగురు ఎడం చేతి వాటం బ్యాటర్లు ఉన్నారని, ఇలా లెఫ్ట్ హ్యాండర్లను అశ్విన్ బాగా ఇబ్బంది పెట్టగలడు. అలాంటి స్పిన్నర్ను పక్కన పెట్టడం షాకింగ్ నిర్ణయం' అని గవాస్కర్ చెప్పాడు. అశ్విన్ లేని భారత బౌలింగ్ దళం ఆసీస్ బ్యాటర్ల ముందు తేలిపోయింది. ముఖ్యంగా ఉమేష్ యాదవ్ చాలా దారుణంగా విఫలం అవడంతో ఆసీస్ తొలిరోజు భారీ స్కోరు చేసింది.