మరికొన్ని గంటల్లో డబ్ల్యూటీసీ ఫైనల్ మొదలవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచి దశాబ్ద కాలంగా తీరని ఐసీసీ ట్రోఫీ కలను తీర్చుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. అయితే ఈ మ్యాచ్లో భారత జట్టు సెలెక్షన్ కొంత సమస్యగా మారింది. ముఖ్యంగా వికెట్ కీపర్గా ఎవరిని ఆడించాలని నిపుణులు అందరూ తలలు పట్టుకుంటున్నారు.
ఈ మ్యాచ్ కోసం ఎంపిక చేసిన కేఎస్ భరత్, ఇషాన్ కిషన్ ఇద్దరికీ ఇంగ్లండ్లో ఆడిన అనుభవం లేదు. దీని వల్లనే ఇది పెద్ద చర్చకు దారి తీసింది. ఇలాంటి సమయంలో కేఎస్ భరత్ ఆసక్తికర విషయం చెప్పాడు. టీమిండియా లెజెండరీ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ తనకు కొన్ని సలహాలు ఇచ్చినట్లు భరత్ వెల్లడించాడు. ఐపీఎల్ సమయంలో తను ధోనీతో మాట్లాడినట్లు చెప్పాడు.

ధోనీ సలహాతో ఇంగ్లండ్ పరిస్థితులకు ఎలా అలవాటు పడాలి? వికెట్ కీపర్లకు ఇక్కడ ఏం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి? అని తెలుసుకున్నట్లు భరత్ తెలిపాడు. 'అది నాకు చాలా ఉపయోగపడిన సంభాషణ. దాన్నుంచి నేను చాలా నేర్చుకున్నా' అని భరత్ గుర్తుచేసుకున్నాడు. ఇలాంటి ఛాలెంజింగ్ పరిస్థితుల్లో తనకు తెలిసి బెస్ట్ వికెట్ కీపర్ ధోనీనే అని చెప్పిన భరత్.. ధోనీకి ఉండే స్పృహ, కీపర్గా తను వేసే ప్లాన్స్ సూపర్గా ఉంటాయని చెప్పాడు.
'కీపర్గా ఉండాలంటే ఇంటెంట్, ప్యాషన్ ఉండాల్సిందే. ఎందుకంటే కీపింగ్ను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అదొక థ్యాంక్లెస్ జాబ్. టెస్టుల్లో అయితే ఏకంగా 90 ఓవర్లు కీపింగ్ చేయాలి. ప్రతి బంతి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. కాబట్టి ఈ సవాళ్లను స్వీకరించి, జట్టు కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడాలి. లేదంటే చాలా కష్టం' అని భరత్ వివరించాడు. ఏదేమైనా కిషన్ కన్నా ముందు భరత్నే ఈ మ్యాచ్లో ఆడిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే ఈ తెలుగు కుర్రాడు ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.