డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టు దుమ్మురేపింది. తొలి ఇన్నింగ్స్లో 469 పరుగులు చేసిన కంగారూలు.. రెండో ఇన్నింగ్స్లో 270 పరుగులకు ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు. ఇంకా ఒకటిన్నర రోజుల ఆట మిగిలే ఉన్నా కూడా ఈ మ్యాచ్లో భారత్ గెలవడం చాలా కష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే భారత్ ముందు ఇప్పుడున్న టార్గెట్ ఏకంగా 444 పరుగులు.
ఓవల్ పిచ్ చరిత్రలో ఇప్పటి వరకు ఒక్క టీం కూడా 300 సమీపంలోని టార్గెట్ను కూడా ఛేజ్ చేయలేకపోయాయి. చిట్టచివరగా 1902లో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో 263 పరుగుల టార్గెట్ను ఇంగ్లండ్ ఛేజ్ చేసింది. అదే ఇక్కడ భారీ లక్ష్య ఛేదన. ఈ లెక్కన చూసుకుంటే ఆసీస్ ఉంచిన 444 పరుగుల టార్గెట్ను ఛేజ్ చేయడం భారత్కు చాలా కష్టంగా కనిపిస్తోంది.

ఇక నాలుగో రోజు ఆట మొదలైన కాసేపటికే ప్రమాదకర మార్నస్ లబుషేన్ (41)ను ఉమేష్ యాదవ్ అవుట్ చేశాడు. అయితే కామెరూన్ గ్రీన్ (25), అలెక్స్ క్యారీ (66 నాటౌట్) కాసేపు ఇన్నింగ్స్ నడిపించారు. గ్రీన్ అవుటైన తర్వాత క్యారీ జోరు పెంచాడు. ఎడాపెడా బౌండరీలు బాదేస్తూ.. వన్డే తరహాలో పరుగులు చేశాడు. అతనికి మిచెల్ స్టార్క్ (41) మంచి సహకారం అందించాడు.
స్టార్క్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ప్యాట్ కమిన్స్ (7) ఎక్కువ సేపు నిలవలేదు. భారీ షాట్ ఆడబోయి పెవిలియన్ చేరాడు. అతను అవుటవగానే ఇన్నింగ్స్ డిక్లేర్ చేయాలని ఆసీస్ నిర్ణయించింది. అప్పటికి ఆసీస్ స్కోరు 270/8. భారత్ ముందు 444 పరుగుల టార్గెట్ నిలిచింది. ఇంత భారీ టార్గెట్ ఛేజ్ చేయాలంటే భారత్కు మంచి ఆరంభం దక్కాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
టీమిండియా బ్యాటర్లు మరీ డిఫెన్సివ్గా ఆడితే ఈ లక్ష్యాన్ని ఛేజ్ చేయడం కుదరదు. గెలవాలంటే కచ్చితంగా భారత ఆటగాళ్లు వేగంగా ఆడాల్సి ఉంది. అయితే రోహిత్ ఫామ్లో లేకపోవడం, ఇంగ్లండ్లో ఆడిన అనుభవం గిల్కు లేకపోవడం కొంత ఆందోళన కలిగించే అంశాలు. దీంతో మరోసారి పుజారా, కోహ్లీలపైనే భారత బ్యాటింగ్ ఆధార పడాల్సి వస్తుంది. వాళ్లు ఫెయిలైతే ఈ మ్యాచ్లో భారత్ ఓడిపోవడం ఖాయం.