దశాబ్దంపైగా ఐసీసీ ట్రోఫీ నెగ్గని భారత జట్టు.. ఈసారి డబ్ల్యూటీసీ ఫైనల్ ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది. ఓవల్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఓడించేందుకు రెడీ అవుతోంది. డబ్ల్యూటీసీ 2021-2023 సైకిల్ పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఈ జట్టు ట్రోఫీ కోసం తలపడుతున్నాయి.
ఈ మ్యాచ్ కోసం ఓవల్లో రెండు పిచ్లు తయారు చేసినట్లు సమచారం. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఈ నిర్ణయం తీసుకుందట. ఏదైనా అనుకోని ఘటన వల్ల మ్యాచ్ మధ్యలో ఆగిపోతే? అనే అనుమానంతోనే రెండు పిచ్లు తయారు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇది కేవలం ముందు జాగ్రత్త మాత్రమే అని ఐసీసీ అంటోంది.

లండన్లో ప్రస్తుతం ఆయిల్ నిరసనలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఈ నిరసన కారులు ఓవల్ స్టేడియంలో మ్యాచ్ ఆడే సమయంలో ఏమైనా అడ్డంకులు కలుగ జేయవచ్చని ఐసీసీ అనుమానం. ఈ క్రమంలోనే మ్యాచ్ మధ్యలో పిచ్ మార్చాల్సి వస్తే తీసుకోవలసిన చర్యలను కూడా ఐసీసీ వివరిచింది. అలాగే ఈ పరిస్థితి గురించి భారత్, ఆస్ట్రేలియా రెండు జట్లకు ముందుగానే చెప్పారట.
ఒకవేళ నిజంగానే ఏదైనా జరిగిన మ్యాచ్ వేదిక మార్చాల్సి వస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటామని రెండు టీముల కెప్టెన్లకు ఐసీసీ వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఒకవేళ మ్యాచ్ మధ్యలో పిచ్ మార్చాల్సి వస్తే.. అంపైర్లు ఇద్దరు కెప్టెన్లతో ఈ విషయం చర్చిస్తారని, అనంతరం ఒక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
ఈ క్రమంలో సడెన్గా పిచ్ మార్చడం వల్ల ఒక జట్టుకు అనవసరంగా మేలు జరగకుండా కూడా చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. రెండు పిచ్లలో కొన్ని భేదాలు ఉన్నప్పటికీ.. దాదాపుగా ఒకేలా బౌలర్లకు సహకరిస్తాయని కూడా సమాచారం. మరి ఐసీసీ భయపడుతున్న ఘటనలు ఇక్కడ జరుగుతాయేమో చూడాలి.