డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత జట్టు ఎదురీదుతోంది. భారీ ఆధిక్యంతో రెండోసారి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. భారత్ ముందు 444 పరుగుల అసాధ్యమైన లక్ష్యాన్ని ఉంచింది. ఇలాంటి సమయంలో టీమిండియాకు మంచి ఓపెనింగ్ అందించేందుకు రోహిత్ శర్మ (43), శుభ్మన్ గిల్ (18) ప్రయత్నించారు. అయితే థర్డ్ అంపైర్ కాంట్రవర్షియల్ నిర్ణయానికి గిల్ బలయ్యాడు.
ఆ తర్వాత లియాన్ బౌలింగ్లో స్వీప్ షాట్ ఆడబోయిన రోహిత్ కూడా పెవిలియన్ చేరాడు. ఇలాంటి సమయంలో ఎన్నో ఆశలు పెట్టుకున్న ఛటేశ్వర్ పుజారా (27) బాగానే ఆడుతున్నట్లు కనిపించాడు. కానీ ప్యాట్ కమిన్స్ వేసిన బౌన్సర్ను కీపర్ తల మీదుగా ఆడేందుకు ప్రయత్నించి క్యాచ్ ఇచ్చాడు. ఇలా అతను వికెట్ పారేసుకోవడం చూసిన ఫ్యాన్స్ షాకయ్యారు.

ఇలాంటి సమయంలో విరాట్ కోహ్లీ (44 నాటౌట్), అజింక్య రహానే (20 నాటౌట్) జట్టును ఆదుకున్నారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడిన ఈ జోడీ.. వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించింది. దీంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 3 వికెట్ల నష్టానికి 164 పరుగులతో నిలిచింది. భారత్ గెలవాలంటే ఇంకా 280 పరుగులు చేయాల్సి ఉంది.

అయితే ఓవల్లో ఇప్పటి వరకు చేసిన హయ్యెస్ట్ రన్ ఛేజ్ 263 పరుగులే కావడం గమనార్హం. అలాంటి పిచ్పై భారత ఆటగాళ్లు ఏకంగా 444 పరుగులు ఛేజ్ చేయడం అంటే మాటలు కాదు. ఇది అసాధ్యమే అనిపిస్తోంది. కానీ కోహ్లీ, రహానే ఇద్దరూ మంచి టచ్లో ఉండటంతో ఫ్యాన్స్ ఈ అసాధ్యాన్ని టీమిండియా సుసాధ్యం చేస్తుందని ఆశిస్తున్నారు.
గతంలో అంటే 2001లో ఆస్ట్రేలియాపై రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్ ఇద్దరూ అద్భుతంగా పోరాడి 376 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన విషయం క్రికెట్ అభిమానులకు తెలిసిందే. ఇప్పుడు కోహ్లీ, రహానే కూడా అదే మాదిరి రాణించి భారత్కు విజయం అందించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 'వీళ్లిద్దరూ చరిత్ర సృష్టిస్తారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారు' అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.