ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత జట్టు పేలవ ప్రదర్శన చేస్తోంది. తొలి రోజు ఆటలో భారత బౌలర్లు తేలిపోయారు. రెండో రోజు వాళ్లు ఆకట్టుకున్నా.. టీమిండియా బ్యాటర్లు చాలా చెత్త ప్రదర్శన చేశారు. ఈ మ్యాచ్లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ కూడా ఫెయిలయ్యాడు. ఈ మ్యాచ్లో మిచెల్ స్టార్క్ బౌలింగ్లో కోహ్లీ పెవిలియన్ చేరాడు.
రెండో రోజు మ్యాచ్లో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ (15), శుభ్మన్ గిల్ (13) ఇద్దరూ ఫెయిలయ్యారు. ఛటేశ్వర్ పుజారా (14) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. ఇలాంటి సమయంలో ఫ్యాన్స్ అంతా ఎన్నో ఆశలు పెంచుకున్న విరాట్ కోహ్లీ (14) కూడా రాణించలేదు. మిచెల్ స్టార్క్ వేసిన బంతి అనూహ్యంగా బౌన్స్ అవడంతో అతను తడబడ్డాడు.

డిఫెండ్ చేసుకోవడంలో అతను విఫలం అవడంతో కోహ్లీ గ్లవ్ను తాకిన బంతి.. స్లిప్స్లో ఉన్న స్టీవ్ స్మిత్ వైపు వెళ్లింది. అతను దాన్ని గాల్లోకి ఎగిరి మరీ పట్టేయడంతో కోహ్లీ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇలా కీలక మ్యాచ్లో కోహ్లీ విఫలం అవడంతో ఫ్యాన్స్ అతన్ని తెగ ట్రోల్ చేశారు. గెలవాల్సిన మ్యాచ్లో కూడా విఫలం అవడం వాళ్లకు ఏమాత్రం నచ్చలేదు.
ఇలా సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేయడంతో కోహ్లీ తన ఇన్స్టాలో ఒక పోస్టు షేర్ చేశాడు. 'మనల్ని ఇతరులు ద్వేషించే నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడే ఇతరుల అభిప్రాయం అనే జైలు నుంచి మనకు స్వేచ్ఛ దొరుకుతుంది' అని మీనింగ్ వచ్చే పోస్టును కోహ్లీ షేర్ చేశాడు. ఇది చూసిన ఫ్యాన్స్ అతన్ని మరింత ట్రోల్ చేస్తున్నారు.
కనీసం ఒక్క ఐసీసీ ట్రోఫీ అయినా గెలిచిన తర్వాత ఇలాంటి నీతులు చెప్పు అంటూ కోహ్లీని కొందరు విమర్శించారు. కొందరేమో 'బ్యాటింగ్ చేయడు కానీ.. మిగతా వన్నీ చేస్తాడు' అంటూ తిడుతున్నారు. మరి రెండో ఇన్నింగ్స్లో అయినా కోహ్లీ రాణించి విమర్శకుల నోళ్లు మూయిస్తాడేమో చూడాలి.