డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత జట్టు ఎదురీదుతోంది. భారీ ఆధిక్యంతో రెండోసారి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. భారత్ ముందు 444 పరుగుల అసాధ్యమైన లక్ష్యాన్ని ఉంచింది. ఇలాంటి సమయంలో టీమిండియాకు మంచి ఓపెనింగ్ అందించేందుకు రోహిత్ శర్మ (43), శుభ్మన్ గిల్ (18) ప్రయత్నించారు. అయితే థర్డ్ అంపైర్ కాంట్రవర్షియల్ నిర్ణయానికి గిల్ బలయ్యాడు.
ఆ తర్వాత లియాన్ బౌలింగ్లో స్వీప్ షాట్ ఆడబోయిన రోహిత్ కూడా పెవిలియన్ చేరాడు. ఇలాంటి సమయంలో ఎన్నో ఆశలు పెట్టుకున్న ఛటేశ్వర్ పుజారా (27) బాగానే ఆడుతున్నట్లు కనిపించాడు. అలాంటిది సడెన్గా ఏమైందో ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో పరమ చెత్త షాట్ ఆడి పెవిలియన్ చేరాడు. కమిన్స్ వేసిన బౌన్సర్ను కీపర్ తల మీదుగా అప్పర్ కట్ ఆడేందుకు పుజారా ప్రయత్నించాడు.

ఇలాంటి షాట్లు పుజారా సాధారణంగా ఆడడు. కానీ ఎందుకో ఈ మ్యాచ్లో ఆడబోయాడు. అయితే అది సరిగా కనెక్ట్ కాలేదు. ఈ క్రమంలో ఎడ్జ్ తీసుకున్న బంతి నేరుగా కీపర్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో పుజారా నిరాశగా పెవిలియన్ బాట పట్టారు. ఇదంతా చూసిన ఫ్యాన్స్కు మతిపోయింది. కొన్ని నెలలుగా ఇంగ్లండ్లోనే ఉండి, కౌంటీలు ఆడుతున్న పుజారాపై ఈ మ్యాచ్లో ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
ఓవల్ పరిస్థితులను పుజారా చక్కగా అంచనా వేసుకుంటాడని, భారత బ్యాటింగ్కు వెన్నెముకలా మారతాడని అనుకున్నారు. కానీ ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్సుల్లో పుజారా ఫెయిలయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో కామెరూన్ గ్రీన్ వేసిన డెలివరీని అంచనా వేయలేక.. దాన్ని వదిలేయడానికి చూశాడు. కానీ ఇన్స్వింగ్ అయినా ఆ బంతి వికెట్లను కూల్చింది. దీంతో షాకైపోయిన అతను మైదానం వీడాడు.
ఇలా చెత్త నిర్ణయాలు, పరమ చెత్త షాట్లతో భారత జట్టుకు పుజారా శత్రువుగా మారాడని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇకనైనా రిటైర్మెంట్ తీసుకుంటే చాలా బాగుంటుందని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. 'ఇప్పటి వరకు భారత క్రికెట్కు నువ్వు చేసింది చాలు పుజీ భాయ్. దయచేసి ఇకనైనా రిటైర్ అయిపో' అని దండాలు పెడుతున్నారు. మరి రహానేను పక్కన పెట్టేసినట్లే పుజారాను కూడా సెలెక్టర్లు పక్కన పెడతారేమో చూడాలి.