టెస్టుల్లో బెస్ట్ టీంగా నిలిచేందుకు టీమిండియా ప్రయత్నిస్తోంది. దీనికోసం వరల్డ్ టెస్టు ఛాంపియన్షిన్ ఫైనల్ మ్యాచులో బలమైన ఆస్ట్రేలియాను ఓడించాల్సి ఉంటుంది. అయితే ఓవల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టెస్టు క్రికెట్లో ఎంతో కీలకమైన ఈ మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
చాలా కీలకమైన ఈ మ్యాచ్ చూసేందుకు భారత స్టార్ ఆటగాడు శిఖర్ ధవన్ కూడా ఓవల్ స్టేడియానికి వచ్చాడు. అతనితోపాటు విండీస్ వీరుడు క్రిస్ గేల్ కూడా కనిపించాడు. వీళ్లిద్దరూ కలిసి టెస్టు క్రికెట్ బెస్ట్ మ్యాచ్ను ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఇలా వీళ్లిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. టెస్టు క్రికెట్ ఎంత ఎంటర్టైనింగ్గా ఉంటుందో వీళ్లను చూస్తేనే తెలుస్తోందని ఫ్యాన్స్ అంటున్నారు.

గేల్, ధవన్ ఇద్దరూ కూడా సరదాగా జోకులు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ ఈ మ్యాచ్ చూశారు. అయితే ఈ మ్యాచ్ తొలి రోజు భారత బౌలర్లు పేలవ ప్రదర్శన చేశారు. ఆరంభంలో కొంత రాణించిన పేసర్లు.. ఆ తర్వాత తేలిపోయారు. మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్నట్లు కనిపించిన ఆసీస్ ఆ తర్వాత పుంజుకుంది.
ముఖ్యంగా ట్రావిస్ హెడ్ (146 నాటౌట్), స్టీవ్ స్మిత్ (95 నాటౌట్) ఇద్దరూ నాలుగో వికెట్కు అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. వీళ్లిద్దరూ 251 పరుగుల పార్టనర్షిప్ నెలకొల్పడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 327/3 స్కోరుతో పైచేయి సాధించింది. రెండో రోజు తొలి సెషన్లో భారత పేసర్లు రాణిస్తే.. టీమిండియా మళ్లీ పోటీలోకి వచ్చే అవకాశం ఉంది.
అలా జరగకుంటే ఈ మ్యాచ్ కూడా భారత్ చేయి జారినట్లే అని ఫ్యాన్స్ అంటున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్సీ చాలా పేలవంగా ఉందని కొందరు విమర్శలు చేస్తున్నారు. ఈ కారణంగానే భారత్ ఈ మ్యాచ్లో వెనుకబడిందని అంటున్నారు. మరి రెండో రోజున టీమిండియా ఏం చేస్తుందో చూడాలి.