డబ్ల్యూటీసీ ఫైనల్ తొలి రోజు ఆటలో టీమిండియా చేతులెత్తేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రోహిత్ సేన.. ఆరంభంలో ఫర్వాలేదనిపించింది. సిరాజ్, షమీ ఇద్దరూ చక్కగా బౌలింగ్ చేశారు. కానీ ఆ తర్వాత మాత్రం భారత పేసర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ముఖ్యంగా ఉమేష్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ ధారాళంగా పరుగులు ఇచ్చారు.
ఇదే సమయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ వ్యూహాలపై కూడా విమర్శలు వచ్చాయి. అశ్విన్ వంటి స్పిన్నర్ను పక్కన పెట్టడం, సరైన ఫీల్డింగ్ సెటప్ చేయలేకపోవడాన్ని నిపుణులు తప్పుబడుతున్నారు. ఈ మ్యాచ్ కామెంటరీ ప్యానెల్లో ఆస్ట్రేలియా మాజీ కోచ్ జస్టిన్ ల్యాంగర్ కూడా ఉన్నాడు. అతను ఈ సందర్భంగా షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కెప్టెన్గా కోహ్లీ అద్భుతంగా రాణించాడని చెప్పాడు.

'కెప్టెన్గా కోహ్లీ ఎగ్రెషన్ నాకు బాగా ఇష్టం. అతన్ని వన్డేల్లో కెప్టెన్గా కొనసాగించకపోవడం బీసీసీఐ చేసిన పొరపాటు. ఈ విషయంలో అతనికి బీసీసీఐ అన్యాయం చేసిందనే చెప్పాలి. దీనిలో ఎలాంటి సాకులు వినాలని నాకు లేదు. అతను కనుక వన్డేల్లో కెప్టెన్సీ కొనసాగించాలని అనుకుంటే.. కోహ్లీపై ఉండే గౌరవం కోసమైనా దానికి బీసీసీఐ ఒప్పుకొని ఉండాల్సింది' అని ల్యాంగర్ అన్నాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్ తొలి రోజే రోహిత్ శర్మ కెప్టెన్సీ విషయంలో తేలిపోవడం, తన బౌలర్లపైనే చిరాకు పడటంపై అభిమానులు కూడా సంతోషంగా లేరు ఇలాంటి సమయంలో ల్యాంగ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 'విరాట్ విషయంలో నాకు నచ్చని విషయం ఒక్కటి కూడా లేదు. అతని ఎగ్రెషన్, ప్యాషన్, బ్యాటింగ్.. అతను ఒక గొప్ప కెప్టెన్' అని మెచ్చుకున్నాడు.
డిసెంబర్ 2021లో కోహ్లీని వన్డే కెప్టెన్గా బీసీసీఐ ఎలాంటి ప్రకటనా లేకుండా సడెన్గా తొలగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అతని స్థానంలో రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. వన్డేల్లో కోహ్లీ కెప్టెన్సీ రికార్డు అద్భుతంగా ఉన్నా కూడా ఇలా అతన్ని సారధిగా తొలగించడం ఎన్నో విమర్శలకు దారి తీసింది. కోహ్లీ కెప్టెన్సీలో 95 వన్డేలు ఆడిన భారత జట్టు 65 మ్యాచుల్లో గెలవడం గమనార్హం. అంటే కోహ్లీ విజయాల శాతం 70.43 అన్నమాట.