ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కీలకంగా మారాడు. తొలి ఇన్నింగ్స్లో మిచెల్ స్టార్క్ వేసిన బంతి అనూహ్యంగా బౌన్స్ అవడంతో పెవిలియన్ చేరిన కోహ్లీ.. రెండో ఇన్నింగ్స్లో చక్కగా ఆడుతున్నాడు. రోహిత్, పుజారా చెత్త షాట్లు ఆడి పెవిలియన్ చేరడంతో జట్టును గట్టున పడేసే బాధ్యతను తీసుకున్నాడు.
అతనికి అజింక్య రహానే మంచి సహకారం అందిస్తున్నాడు. ఈ క్రమంలో వీళ్లిద్దరిపైనే భారత అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. వీళ్లిద్దరూ రాణిస్తేనే డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ గెలుస్తుందని అంటున్నారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి హాఫ్ సెంచరీకి సమీపంలో ఉన్న కోహ్లీ ఐదో రోజు ఆట మొదలుపెట్టనున్నాడు.

ఈ మ్యాచ్లో కీలకంగా మారిన అతను తన చూడచక్కని ఇన్నింగ్స్తో పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ఐసీసీ నాకౌట్ మ్యాచుల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ రెండో ఇన్నింగ్స్లో 44 పరుగులతో అజేయంగా ఉన్న కోహ్లీ.. ఐసీసీ నాకౌట్స్లో 678 పరుగులు చేశాడు.
అతని తర్వాత ఈ జాబితాలో 657 పరుగులతో సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. అలాగే డబ్ల్యూటీసీలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా కూడా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఇక ఐసీసీ టోర్నీల ఫైనల్స్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. అతను ఇప్పటి వరకు ఐసీసీ ఫైనల్స్లో 275 పరుగులు చేసి ఉన్నాడు.
అంతేకాదు ఆస్ట్రేలియాపై ఎప్పుడూ రాణించే కోహ్లీ.. కంగారూలపై 5 వేల అంతర్జాతీయ పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. ఆసీస్పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఆసీస్పై 5 వేల పైగా పరుగులు చేసింది కేవలం ఇద్దరు భారత బ్యాటర్లే. వాళ్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ.
అలాగే టెస్టుల్లో ఆస్ట్రేలియాపై 2 వేల పరుగుల మైలురాయిని కూడా కోహ్లీ చేరుకున్నాడు. అంతేకాదు, ఒక జట్టుపై ఐదు వేల అంతర్జాతీయ పరుగులు చేయడంతోపాటు 50+ సగటు మెయింటైన్ చేసిన రెండో క్రికెటర్గా నిలిచాడు. ఆసీస్ దిగ్గజం డాన్ బ్రాడ్మన్ మాత్రమే ఇంతకుముందు ఈ ఘనత సాధించాడు. ఇప్పుడు ఈ ఎలైట్ లిస్టులో కోహ్లీ కూడా చేరాడు.