డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ ఓడిపోవడంతో అందరికీ ఒక విషయంలో క్లారిటీ వచ్చింది. అదేంటంటే.. అందరూ బలం అనుకున్న భారత బ్యాటింగ్ చాలా వీక్ అని అర్థమైంది. ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమికి భారత బ్యాటింగే కారణం. ఇంతకాలం భారత బౌలింగ్ బలహీనంగా ఉందని, ఇక ఈ ఏడాది అయితే బుమ్రా లేకపోవడంతో భారత బౌలింగ్ మరింత వీక్ అయిపోయిందని అనుకున్నారు.
కానీ డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత బౌలర్లు బాగానే బౌలింగ్ చేశారు. తొలి రోజు ఆటలో మాత్రమే వాళ్లు విఫలమయ్యారు. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్నారు. కానీ భారత బ్యాటింగ్ మాత్రం అలాకాదు. రెండు ఇన్నింగ్స్ల్లో దారుణంగా ఫెయిలయ్యారు. అయితే ఇది ఇప్పటి సమస్య కాదు. గత ఐదేళ్లలో విదేశాల్లో జరిగిన టెస్టుల్లో భారత్ రాణించినట్లే కనిపించినా.. బ్యాటింగ్ మాత్రం ఫెయిలవుతూనే వచ్చింది.

గత ఐదేళ్లలో భారత జట్టు విదేశాల్లో మొత్తం 27 టెస్టులు ఆడింది. వీటిలో పదింట విజయం సాధించిన జట్టు.. 14 మ్యాచుల్లో ఓడింది. మూడు మ్యాచులు డ్రా అయ్యాయి. ఇదంతా చూస్తే భారత ప్రదర్శన మెరుగ్గానే కనిపిస్తుంది. ఎందుకంటే అంతకుముందు విదేశాల్లో భారత్ గెలవడమే చాలా అరుదు. అలాంటిది ఈ ఐదేళ్లో పది మ్యాచులు గెలవడం అంటే మాటలు కాదు. అయితే ఇక్కడే మరో విషయం తెలుసుకోవాలి.
ఈ ఐదేళ్లలో భారత్ స్కోరు 400 దాటింది కేవలం ఐదుసార్లే. మ్యాచ్లో ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు చేసినా ఆ జట్టు ఈజీగా 400+ స్కోరు చేస్తుంది. ఈ విషయం డబ్ల్యూటీసీ ఫైనల్లో చాలా స్పష్టంగా కనిపించింది. కానీ భారత్ మాత్రం అలా చేయలేకపోయిందన్నమాట. మొత్తం 27 టెస్టుల్లో భారత జట్టు 50 సార్లు అయినా బ్యాటింగ్ చేసి ఉంటుంది. ఈ యాభై సార్లలో కేవలం ఐదు సార్లే 400 పరుగుల మార్కు దాటిందన్నమాట.

అంటే భారత బ్యాటింగ్ ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు విదేశాల్లో గెలవకపోయినా కూడా.. బ్యాటర్లు చాలా పట్టుదలగా ఆడేవాళ్లు. ద్రావిడ్, లక్ష్మణ్ వంటి వాళ్లు అలా పేరు సంపాదించిన వారే. అదే ప్రస్తుత జట్టును పరిశీలిస్తే.. డబ్ల్యూటీసీ ఫైనల్ కచ్చితంగా భారత్ గెలవాల్సింది. ఎందుకంటే భారత బౌలర్లు కట్టుదిట్టంగానే బౌలింగ్ చేశారు. కానీ రెండు ఇన్నింగ్సుల్లోనూ కీలకమైన ఆటగాళ్లు ఫెయిలవడంతో టీం ఓడిపోయింది.
ఇలా భారత బ్యాటర్లు ఏళ్ల తరబడి విఫలం అవుతున్నా కూడా ఎవరూ పట్టించుకోలేదు. వాళ్లు స్టార్లు కావడం, గతంలో మ్యాచులు గెలిపించిన వాళ్లు కావడంతో ఆయా ప్లేయర్లపై కఠిన చర్యలు కూడా తీసుకోలేదు. దీంతో వాళ్లు అదే విధానం కొనసాగిస్తూ వచ్చారు. ఇంకా గట్టిగా మాట్లాడితే వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆడటం మొదలు పెట్టారు. డబ్ల్యూటీసీ ఫైనల్ తొలి ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజా, రెండో ఇన్నింగ్స్లో కోహ్లీ, రోహిత్ అవుటైంది తమ హాఫ్ సెంచరీలు త్వరగా పూర్తి చేసుకుందామనే తొందర్లోనే.
భారత బ్యాటింగ్ ఎప్పుడూ ఎక్కువగా టాపార్డర్ మీదనే ఆధారపడుతుందనే విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో వాళ్లే దారుణంగా ఆడారు. శుభ్మన్ గిల్ (13,18), రోహిత్ శర్మ (15, 43), ఛటేశ్వర్ పుజారా (14, 27), విరాట్ కోహ్లీ (14, 49) ఒక్క ఇన్నింగ్స్లో కూడా కనీసం హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. అదే సమయంలో ఆసీస్లో స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, అలెక్స్ క్యారీ అద్భుతంగా రాణించారు. అంటే ఈ మ్యాచ్లో విజేతను నిర్ణయించింది బ్యాటింగే అన్నమాట.