డబ్ల్యూటీసీ ఫైనల్ 2023లో భారత జట్టు ఘోరంగా ఓడిపోయింది. ఐదో రోజు 280 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్కు సరైన ఆరంభం దక్కలేదు. వ్యక్తిగత స్కోరు 44తో ఐదో రోజు ఆట ప్రారంభించిన విరాట్ కోహ్లీ 49 పరుగులకు అవుటయ్యాడు. అతను అవుటైన తర్వాత టీమిండియా పోరాటం ఎక్కువ సేపు కొనసాగలేదు. వచ్చిన బ్యాటర్ వచ్చినట్లే పెవిలియన్ చేరారు.
దీంతో భారత జట్టు కేవలం 234 పరుగులకే కుప్పకూటింది. ఆస్ట్రేలియా ఈ మ్యాచ్లో ఏకంగా 209 పరుగుల తేడాతో విజయం సాధించి, టెస్టు గదను అందుకుంది. ఈ ఓటమి అనంతరం మాట్లాడిన రోహిత్ శర్మ.. వచ్చే డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత జట్టులో కచ్చితంగా మార్పులు ఉంటాయని చెప్పాడు. ఈసారి డబ్ల్యూటీసీ ఫైనల్ ఎక్కడ జరుగుతుందనే దాన్ని బట్టి ఈ మార్పులు చేస్తామన్నాడు.

'జట్టు కాంబినేషన్ గురించి కచ్చితంగా చర్చ ఉంటుంది. జట్టుకు ఏది మంచిదో, మేం వచ్చే రెండేళ్లలో ఎలాంటి క్రికెట్ ఆడాలని అనుకుంటున్నామో దానికి తగ్గట్లు మార్పులు ఉంటాయి. జట్టులో ఇచ్చిన పాత్రకు ఎవరు న్యాయం చేయగలరు? అని ప్రశ్నించుకోవాలి. ఇప్పటికే చాలా మంది ప్లేయర్లు మనకు అందుబాటులో ఉన్నారు. దేశవాళీల్లో చాలా మంది కుర్రాళ్లు చెలరేగుతున్నారు కూడా' అని రోహిత్ అన్నాడు.
ఈ క్రమంలో కొత్త కుర్రాళ్లకు కూడా జట్టులో చోటు దక్కుతుందని రోహిత్ అభిప్రాయపడ్డాడు. అయితే వచ్చే డబ్ల్యూటీసీ ఫైనల్ ఎక్కడ జరుగుతుందో దాన్ని బట్టే ఈ మార్పులు ఉంటాయని చెప్పాడు. 'వచ్చే డబ్ల్యూటీసీ ఫైనల్ ఎక్కడ జరుగుతుందో కూడా గమనిస్తాం. మేం ఎక్కడ ఆడాల్సి ఉంటుందో దాన్ని బట్టే ఎలాంటి ఆటగాళ్లను ఎంపిక చేయాలో ఒక ఐడియా వస్తుంది. అలాగే ఎలాంటి క్రికెట్ ఆడాలో కూడా ఒక డెసిషన్కు వస్తాం' అని పేర్కొన్నాడు.