భారత్, ఆస్ట్రేలియా మధ్య చివరిదైన ఐదో టీ20కి వేదిక సిద్ధమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఐదు మ్యాచుల సిరీసును 3-1తో తన ఖాతాలో వేసుకున్న భారత జట్టు.. ఈ నామమాత్రపు మ్యాచులో కూడా సత్తా చాటి, అదే జోష్తో సౌతాఫ్రికా చేరుకోవాలని భావిస్తోంది. అదే సమయంలో ఈ మ్యాచులో అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని ఆస్ట్రేలియా కూడా పట్టుదలగా ఉంది.
ఆదివారం సాయంత్రం జరిగే ఈ మ్యాచులో రెండు జట్లు కూడా తమ బెంచ్ బలాన్ని పరీక్షించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాతావరణం కనుక మ్యాచ్కు ఎలాంటి ఆటంకం కలిగించకుంటే.. బెంచ్ బలానికీ మంచి పరీక్ష ఖాయమని నిపుణులు భావిస్తున్నారు. ఇక చివరగా జరిగిన నాలుగో టీ20లో బంతితో అక్షర్ పటేల్, బ్యాటుతో రింకూ సింగ్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

వీళ్లిద్దరూ రాణించడంతో భారత జట్టు 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో సూర్యకుమార్ టీంలో కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది. ఇక చివరి మ్యాచులో కూడా గెలిచి తమ ఆధిక్యాన్ని 4-1కు పెంచుకోవాలని ఈ టీం భావిస్తోంది. వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ ముందు భారత జట్టు కేవలం ఆరు టీ20 మ్యాచులు మాత్రమే ఆడనుంది. దీంతో ఆడే ప్రతి మ్యాచులోనూ భారత జట్టు రాణించాల్సి ఉంటుంది.
అన్ని మ్యాచులను సీరియస్గానే తీసుకోవాలి. ఇక బెంగళూరులో మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడే అవకాశం ఏమాత్రం లేదని వాతావరణ శాఖ చెప్పింది. ఇక్కడ 26 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండొచ్చని, ఆకాశం మేఘావృతమై ఉంటుందని, 72 శాతం గాలిలో తేమ ఉంటుందని వెల్లడించింది. ఉదయం మాత్రం కొంత వర్షం పడే అవకాశం ఉందని, కానీ సాయంత్రం మాత్రం వర్షం పడే అవకాశమే లేదని స్పష్టం చేసింది.
ఇక చిన్నస్వామి స్టేడియంలో పిచ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. బ్యాటింగ్ స్వర్గధామంగా చెప్పుకునే ఈ స్టేడియంలో రెండు జట్ల బ్యాటర్లు చెలరేగే అవకాశం ఉంది. అదే సమయంలో అటు పేసర్లు, ఇటు స్పిన్నర్లకు కూడా పిచ్ నుంచి కొంత సహకారం ఉంటుంది. బౌండరీలు చిన్నవి కావడంతో బౌలర్లు చాలా కష్టపడాల్సి వస్తుంది. అందుకే టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్ ఎంచుకునే అవకాశాలే ఎక్కువ.