వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి ఇంకా భారత అభిమానుల గుండెల్లో పచ్చిగానే ఉంది. అప్పుడే ఆసీస్తో టీ20 సిరీస్ వచ్చేసింది. విశాఖపట్టణం వేదికగా తొలి మ్యాచ్కు అంతా సిద్ధమైంది. గురువారం సాయంత్రం 7 గంటలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది. ఇక్కడి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ మైదానం వేదికగా మ్యాచ్ జరుగుతుంది.
ఇక్కడి పిచ్ చాలా బ్యాలెన్స్గా ఉంటుందని పేరు. అటు బౌలర్లకు, ఇటు బ్యాటర్లకు పిచ్ నుంచి ఎంతో కొంత సహకారం లభిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా, భారత్ జట్లు ఇప్పటి వరకు తలపడిన మ్యాచుల్లో ఎవరు పైచేయి సాధించారని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

ఇక పొట్టి ఫార్మాట్లో ఇటీవల రెగ్యులర్గా కెప్టెన్సీ చేస్తున్న హార్దిక్ పాండ్యా కూడా ఈ మ్యాచ్ ఆడటం లేదు. దీంతో టీ20 నెంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్కు జట్టు పగ్గాలు అందజేశారు. అతని నాయకత్వంలో తొలిసారి భారత జట్టు బరిలో దిగుతోంది. కాబట్టి ఎలాగైనా ఈ సిరీస్ నెగ్గాలని అతను అనుకుంటున్నాడు.
పొట్టి ఫార్మాట్లో ఆసీస్పై భారత్కు మంచి రికార్డు కూడా ఉంది. ఈ రెండు జట్లు 26 టీ20 మ్యాచుల్లో తలపడ్డాయి. వీటిలో 15 సార్లు భారత జట్టు విజయం సాధించగా.. ఆసీస్ కేవలం 10 సార్లే గెలుపు రుచి చూసింది. ఒక మ్యాచులో ఫలితం తేలలేదు. ఇక చివరి ఐదు మ్యాచుల ఫలితాలు చూస్తే మాత్రం రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయనే అనిపిస్తుంది.
చివరి ఐదు హెడ్ టు హెడ్ మ్యాచుల్లో భారత్ మూడుసార్లు విజయం సాధించింది. ఆసీస్ రెండుసార్లే గెలిచింది. గతేడాది సెప్టెంబరులో ఈ రెండు జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ జరిగింది. దానిలో తొలి మ్యాచ్లో ఆసీస్ గెలవగా.. తర్వాతి రెండు మ్యాచుల్లో జయభేరి మోగించిన భారత జట్టు 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఈసారి కూడా ఇలాంటి ఫలితమే సాధించాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది.