వరల్డ్ కప్ ఓటమిని పూర్తిగా మర్చిపోక ముందే ఆసీస్తో ఐదు టీ20ల సిరీస్కు టీమిండియా రెడీ అయిపోయింది. ఈ సిరీసులో సీనియర్ ప్లేయర్లు అందరికీ విశ్రాంతి ఇచ్చిన టీం మేనేజ్మెంట్.. కుర్రాళ్లతో కూడిన జట్టును బరిలో దింపుతోంది. మొత్తం 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది.
వీరిలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు కూడా చోటు దక్కింది. వరల్డ్ కప్ జట్టులో ఉన్న వారిలో కేవలం ముగ్గురు మాత్రమే ఈ సిరీస్ ఆడుతున్నారు. ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తున్నాడు. తొలి మ్యాచ్ విశాఖపట్టణం వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు ఇప్పటికే వైజాగ్ చేరుకున్నాయి కూడా.

ఇక విశాఖలో మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశం పెద్దగా లేదనే తెలుస్తోంది. ఇక్కడి ఉష్ణోగ్రత 28 డిగ్రీల దరిదాపుల్లో ఉంటుందని, గాలిలో 63 శాతం తేమ ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే రెండో ఇన్నింగ్స్ సమయంలో మంచు ప్రభావం మరీ ఎక్కువగా ఉండొచ్చు.
ఇక పిచ్ విషయానికొస్తే.. విశాఖలో పిచ్ ఎప్పుడూ బ్యాలెన్స్గా ఉంటుంది. అటు బౌలర్లకు, ఇటు బ్యాటర్లకు ఎవరికీ ఎక్కువ సహకారం లభించదు. ఇక్కడ జరిగిన చివరి 10 మ్యాచులను పరిశీలిస్తే.. ఈ స్టేడియంలో సగటు స్కోరు 132 పరుగులే కావడం గమనార్హం. ఇక్కడ మొదట బ్యాటింగ్ చేయడం కన్నా.. ఛేజింగ్ చేయడం మంచి నిర్ణయం అని చెప్పొచ్చు.
ఈ వేదికలో జరిగిన మ్యాచుల్లో ఛేజింగ్ చేసిన జట్టు 67 శాతం విజయాలు సాధించింది. కాబట్టి ఈసారి కూడా టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా వర్షం పడుతుందేమో? అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అయితే అలాంటి భయం అక్కర్లేదని వాతావరణ శాఖ అంటోంది.