
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీసులో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక రెండో టెస్టు మ్యాచ్ను ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఆ తర్వాత జరిగే మూడో మ్యాచ్ను హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల వేదికగా నిర్వహించాలని నిర్ణయించారు. కానీ అక్కడి స్టేడియంలో రినొవేషన్ పనులు జరుగుతున్నాయి.
ఇక్కడి డ్రైనేజి వ్యవస్థను మరింత సమర్ధవంతంగా మార్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మైదానంలోని అవుట్ ఫీల్డ్ ఇంకా అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించే స్థాయిలో రెడీ అవలేదట. ఇది చూసిన బీసీసీఐ అధికారులు.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టు వేదికను ఇక్కడి నుంచి మార్చేయాలని అనుకుంటున్నారు. అయితే గతంలో కూడా ఇక్కడ ఎక్కువ టెస్టు మ్యాచులు జరగలేదు. ఇప్పటి వరకు ఒకే ఒక టెస్టు మ్యాచ్ జరిగింది.
2016-17 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చివరి టెస్టు ఇక్కడే జరిగింది. ఆ మ్యాచ్లో భారత జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత ధర్మశాలలో ఒక్క టెస్టు మ్యాచ్ కూడా జరగలేదు. ఇక్కడ చివరగా గతేడాది ఫిబ్రవరిలో అంతర్జాతీయ మ్యాచులు జరిగాయి. శ్రీలంక, భారత్ మధ్య జరిగిన రెండు టీ20 మ్యాచులకు ఈ స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది. ఇప్పుడు ధర్మశాల నుంచి మూడో టెస్టు వేదికను ఎక్కడకు మార్చాలని బీసీసీఐ తర్జనభర్జనలు పడుతోంది.
ఈ సిరీస్లోభాగంగా మార్చి 1 నుంచి ధర్మశాల వేదికగా జరగాల్సిన మూడో టెస్ట్ను బీసీసీఐ మరో చోటుకు తరలించింది. ధర్మశాలలో ఔట్ఫీల్డ్ సిద్ధంగా లేకపోవడంతో ఈ మ్యాచ్ను ఇండోర్కు తరలిస్తున్నట్లు ఓ ప్రకటనను విడుదల చేసింది. మూడో టెస్ట్కు ఇండోని హోల్కర్ మైదానం ఆతిథ్యం ఇస్తుందని పేర్కొంది. బీసీసీఐ క్యురేటర్ తపోష్ ఛటర్జీ ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం (హెచ్పీసీఏ) స్టేడియం పిచ్, ఔట్ఫీల్డ్ను తనిఖీ చేసి బోర్డుకు నివేదిక అందించాడు. అయితే, తొలుత ఈ మ్యాచ్ని విశాఖపట్నం లేదా బెంగళూరుకు తరలిస్తారని వార్తలొచ్చాయి. చివరికి ఇండోర్ను వేదికగా ఖరారు చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.