ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో భారత జట్టు థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచులో బ్యాటుతో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రింకూ సింగ్ చెలరేగారు. దీంతో 208 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా భారత జట్టు ఈజీగా ఛేదించేలా కనిపించింది. అయితే చివరి ఓవర్లో రెండు వరుస రనౌట్లు మ్యాచ్ను థ్రిల్లింగ్గా మార్చేశాయి. ఈ క్రమంలో ఈ మ్యాచులో అద్భుతంగా ఆడి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ప్లేయర్లు ఎవరంటే?
సూర్యకుమార్ యాదవ్
తొలిసారి టీమిండియా కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న సూర్యకుమార్ యాదవ్. ఈ మ్యాచులో బ్యాటుతో చెలరేగాడు. వరల్డ్ కప్లో తేలిపోయింది ఇతనేనా? అనేలా ఆడాడీ టీ20 స్పెషలిస్ట్. మూడు ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును అద్భుతమైన బ్యాటింగ్తో ఆదుకున్నాడు. ఈ మ్యాచులో కేవలం 42 బంతుల్లోనే 80 పరుగులు బాది జట్టును విజయానికి అడుగు దూరంలో నిలిపాడు.

రింకూ సింగ్
విజయానికి అడుగు దూరంలోకి టీమిండియా వచ్చిన తర్వాత.. ఆ చివరి అడుగు వేయించింది మాత్రం రింకూ సింగే. ఫీల్డ్ సెట్టింగ్ను తనకు అనుకూలంగా వాడుకున్న ఈ కుర్రాడు.. సూర్యకుమార్, అక్షర్ పటేల్ అవుటైనా కూడా ఏమాత్రం టెన్షన్ పడలేదు. తనదైన స్టైల్లో బ్యాటింగ్ చేస్తూ చివరి బంతికి సిక్సర్తో మ్యాచ్ ముగించాడు. అయితే అది నోబాల్ కావడంతో సిక్స్ను అంపైర్లు పరిగణనలోకి తీసుకోలేదు. అంత ఒత్తిడిలో సిక్సర్లు బాదడం తన స్పెషాల్టీ అని నిరూపించుకున్నాడు.

ముఖేష్ కుమార్
బంతితో భారత బౌలింగ్ విభాగం అంతా ఈ మ్యాచులో తేలిపోయింది. అయినా సరే ముఖేష్ కుమార్ మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పిన్ పాయింట్ యార్కర్లతో డెత్ ఓవర్లలో ఆసీస్ దూకుడుకు కళ్లెం వేశాడు. ఆవేష్ ఖాన్ను కాదని తనను జట్టులోకి తీసుకోవడం సరైన నిర్ణయమే అని నిరూపించుకున్నాడు. తోటి పేసర్లు అర్షదీప్, ప్రసిద్ధ్ కృష్ణ భారీగా పరుగులు సమర్పించుకుంటుంటే.. తను మాత్రం కేవలం 7.25 ఎకానమీతోనే బౌలింగ్ చేసి అందర్నీ ఆకట్టుకున్నాడు.