ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో భారత జట్టు థ్రిల్లింగ్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచులో గెలిచినా కూడా టీమిండియా కొన్ని పొరపాట్లు చేయడం మనం గమనించవచ్చు. ఈ పొరపాట్ల వల్లనే గెలిచే మ్యాచులో చివరి వరకు సాగేది కాదు. అవేంటో ఒకసారి చూస్తే..
రనౌట్లు..:భారత ఇన్నింగ్సులో మూడు రనౌట్లు ఉన్నాయి. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (0) అయితే కనీసం ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే పెవిలియన్ చేరాడు. ఇక చివర్లో రవి బిష్ణోయి బంతిని మిస్ చేయగానే రింకూ సింగ్ సింగిల్ కోసం పరిగెత్తాడు. అప్పుడు రవి రనౌట్ అయ్యాడు. అదే రింకూ కనుక అవుటై ఉంటే.. చివరకు విజయానికి అవసరమైన పరుగులను బౌలర్లు చేయాల్సి వచ్చేది.

బిష్ణోయి అవుటైన మరుసటి బంతికే డబుల్ తీయడంలో అర్షదీప్ సింగ్ ఫెయిలయ్యాడు. అతను నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్నప్పుడు బంతి లాంగాన్, డీప్ మిడ్వికెట్ మధ్యగా చాలా దూరం వెళ్లింది. కానీ అర్షదీప్ మాత్రం డబుల్ తీయలేకపోయాడు. ఇలా రనౌట్లు అవడం జట్టుకు మంచిది కాదు. వీటిలో ఏదీ కూడా అంత గొప్పగా చెప్పుకోవాల్సింది కూడా కాదు.
బ్యాటింగ్లో దూకుడు..:ఈ మ్యాచులో భారత ఇన్నింగ్స్లో చెప్పుకోదగ్గ విషయం ఏదైనా ఉందంటే.. అది ఎగ్రెసివ్ బ్యాటింగే. భారత బ్యాటింగ్లో ఒక్క ఇషాన్ కిషన్ మాత్రమే తన ఇన్నింగ్స్ ఆరంభంలో భారీగా డాట్ బాల్స్ ఆడాడు. మిగతా బ్యాటర్లు అందరూ ఆరంభం నుంచే చెలరేగారు. ముఖ్యంగా ఆసీస్ బౌలర్ తన్వీర్ సంఘాపై వీళ్లు ఎదురు దాడికి దిగారు.
అతన్ని సెటిల్ అవ్వనీయలేదు. సూర్య ఒక పక్క రెచ్చిపోతుంటే.. మధ్యలో ఇషాన్ కిషన్ కూడా ఈ లెగ్ స్పిన్నర్పై ఎదురు దాడి చేశాడు. భారత బ్యాటర్లు కనుక సంఘాను ఇలా టార్గెట్ చేయకపోయినా.. అలాగే చివరి ఓవర్లలో దూకుడుగా ఆడకపోయినా ఓడిపోయేదే.
ఆరో బౌలర్ ఉన్నా..:తొలిసారి కెప్టెన్గా బాధ్యతలు అందుకున్న సూర్యకుమార్ యాదవ్ పెద్ద పొరపాటు చేశాడు. ఆసీస్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ చెలరేగుతున్నప్పుడు ఆరో బౌలర్ను తీసుకొచ్చి అతనికి బ్రేకులు వేసేందుకు సూర్య ప్రయత్నించాల్సింది. భారత్ వద్ద జైస్వాల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ వంటి పార్ట్ టైం ఆప్షన్స్ ఉన్నాయి.
కానీ వాటిని సూర్య ఉపయోగించుకోలేదు. భారత బౌలర్లలో ఇద్దరు 12కు పైగా ఎకానమీతో బౌలింగ్ చేస్తున్నా కూడా సూర్య.. ఈ విషయంలో ధైర్యం చేయలేదు. ప్రధాన ప్లేయర్లు లేని ఈ జట్టుపై కూడా పార్ట్ టైమర్లను ఉపయోగించకపోతే.. ఇక ఎప్పుడు వాళ్లను ఉపయోగిస్తారు? టీ20 వరల్డ్ కప్లో నేరుగా బౌలింగ్ చేయిస్తారా వీళ్లతో?