ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ మొదలవడానికి ముందు భారత్, పాకిస్తాన్ రెండు జట్లు వన్డే ర్యాంకింగ్స్లో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. రెండు టీమ్స్ వద్ద 115 రేటింగ్ పాయింట్లే ఉన్నా కూడా.. పాకిస్తాన్ అగ్రస్థానంలో నిలిచింది. భారత్ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే ఆస్ట్రేలియాపై తొలి వన్డేలో ఘన విజయం సాధించిన భారత్ ఈ ర్యాంకులను తారమారు చేసింది.
ఈ విజయంతో భారత్ పాయింట్లు 116కు చేరుకున్నాయి. దీంతో వన్డేల్లో టాప్ జట్టుగా భారత్ అవతరించింది. ఇప్పటికే టీ20, టెస్టు ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా.. ఇప్పుడు మూడు ఫార్మాట్లలో అగ్రస్థానంలో నిలిచింది. క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన రెండో జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. ఇంతకుముందు 2012లో సౌతాఫ్రికా ఈ ఘనత సాధించింది.

భారత్ ఈ రికార్డు సృష్టించిన సందర్భంగా బీసీసీఐ, ఐసీసీ ప్రత్యేక పోస్టర్లను విడుదల చేశాయి. ఇవి చూసిన ఫ్యాన్స్ చాలా సంతోషిస్తున్నారు. అన్ని ఫార్మాట్లలో టీమిండియా డామినేట్ చేస్తోందని, వరల్డ్ కప్ కూడా గెలిచేస్తే ఈ సంతోషం రెట్టింపు అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. మరకొందరు ఫ్యాన్స్ ఇదొక అత్యద్భుతమైన అచీవ్మెంట్ అని కొనియాడుతున్నారు.
మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో కేఎల్ రాహుల్ సారధ్యంలోని టీమిండియా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. మహమ్మద్ షమీ ఐదు వికెట్లతో చెలరేగడంతో ఆసీస్ను కేవలం 276 పరుగులకే కట్టడి చేయగలిగింది. బ్యాటింగ్కు సహకరించే మొహాలీ పిచ్పై ఇది అంత గొప్ప స్కోరు కాదు.
ఇక లక్ష్య ఛేదనలో శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ నలుగురూ హాఫ్ సెంచరీలతో రాణించారు. చివరి వరకు క్రీజులో నిలిచిన కేఎల్ రాహుల్ వరుస బౌండరీలతో టీమిండియాకు విజయాన్ని కట్టబెట్టాడు. ఈ సిక్సర్తోనే భారత్కు వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంకు వచ్చిందని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ షాట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.