ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ వల్ల భారత జట్టులో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు లభించాయి. దీంతో వరల్డ్ కప్లో భారత జట్టు మరింత కాన్ఫిడెంట్గా బరిలో దిగేందుకు అవకాశాలు ఉన్నాయి. మరి ఆ సమాధానాలు ఏంటో ఒకసారి పరిశీలిస్తే..
అయ్యర్ ఫామ్:ఆసియా కప్లో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన అయ్యర్.. ఒక్క మ్యాచ్ ఆడగానే మళ్లీ గాయంతో ఆటకు దూరమయ్యాడు. దీంతో అతని ఫామ్, ఫిట్నెస్పై అనేక అనుమానాలు తలెత్తాయి. అయితే ఆసీస్తో మూడు వన్డేల్ల అయ్యర్ రాణించాడు. తొలి వన్డేలో రనౌట్ అయిన అతను.. రెండో వన్డేలో సెంచరీతో ఆకట్టుకున్నాడు.

ఇక చివరిదైన మూడో వన్డేలో కూడా 48 పరుగులు చేశాడు. మొదటి వన్డేలో ఫీల్డింగ్లో కూడా కొంత తడబడిన అతను.. ఆ తర్వాతి రెండు మ్యాచుల్లో మైదానంలో చురుగ్గా కదులుతూ చక్కగా ఫీల్డింగ్ చేశాడు. తన ఫిట్నెస్, ఫామ్ రెండూ పర్ఫెక్ట్గా ఉన్నాయని నిరూపించుకున్నాడు. దీంతో టీమిండియా మిడిలార్డర్ సమస్య తీరినట్లే అని చెప్పొచ్చు.
ఫినిషర్ సూర్య..:వన్డేల్లో ఏమాత్రం రాణించకుండా విమర్శలపాలైన సూర్యకుమార్ యాదవ్ కూడా ఆసీస్పై ఆకట్టుకున్నాడు. తొలి రెండు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలతో రాణించాడు. ముఖ్యంగా ఫినిషర్గా రాణించే సత్తా తనకు ఉందని నిరూపించుకున్నాడు. అలాగే వన్డే కోడ్ను కూడా తను క్రాక్ చేసినట్లు అందరికీ చాటి చెప్పాడు.
దీంతో వరల్డ్ కప్లో సూర్య ఎంపికను ప్రశ్నించిన వారందరికీ సమాధానాలు లభించినట్లయింది. అంతేకాదు, వన్డేల్లో కూడా తన టీ20 తరహా బ్యాటింగ్ పనికొస్తుందని ఇండోర్లో స్పష్టం చేశాడు. ఈ మ్యాచులో కేవలం 37 బంతుల్లోనే 72 పరుగులతో సూర్య చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతో వరల్డ్ కప్లో సూర్య రాణిస్తాడని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
స్పిన్నర్ టెస్టింగ్..:ఆసియా కప్లో అక్షర్ పటేల్ గాయపడటంతో అతని స్థానాన్ని ఆఫ్స్పిన్నర్లతో భర్తీ చేయాలని టీం మేనేజ్మెంట్ అనుకుంది. ఈ క్రమంలో రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్ ఇద్దర్నీ ఆస్ట్రేలియా సిరీసుకు ఎంపిక చేశారు. అలాగే వరల్డ్ కప్ టీంలో ఆఫ్స్పిన్నర్ లేకపోవడంపై కూడా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

అందుకే ఆసీస్తో సిరీసులో వీళ్లిద్దర్నీ టీం మేనేజ్మెంట్ టెస్ట్ చేసింది. ఇటీవలి కాలంలో వన్డేలు ఆడకపోయినా కూడా అశ్విన్, సుందర్ ఇద్దరూ కూడా బంతితో రాణించారు. తను ఆడిన రెండు మ్యాచుల్లో అశ్విన్కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. మొదటి వన్డేలో 1/47, రెండో వన్డేలో 3/41త అశ్విన్ ఆకట్టుకున్నాడు.
ఇక రాజ్కోట్లో రోడ్ వంటి పిచ్పై కూడా సుందర్ చక్కగా బౌలింగ్ చేశాడు. పది ఓవర్లలో కేవలం 48 పరుగులే ఇచ్చాడు. అక్షర్ కనుక ఫిట్ అని తేలితే అశ్విన్, సుందర్ ఇద్దరికీ వరల్డ్ కప్లో చోటు దక్కకపోవచ్చు. కానీ ఒకవేళ అక్షర్ ఆడలేకపోతే ఇద్దరిలో ఎవరినైనా టీంలోకి తీసుకోవచ్చనే నమ్మకం కలిగింది.
సత్తా చాటిన కుర్రాళ్లు:ఆసీస్తో మొదటి రెండు వన్డేల్లో సీనియర్ మెంబర్లు టీంలో లేరు. అయినా సరే భారత బ్యాటింగ్ విభాగం అద్భుతంగా రాణించింది. ముఖ్యంగా ఛేజింగుల్లో రోహిత్, కోహ్లీ లేకపోతే టీమిండియా బ్యాటింగ్ చాలా వీక్గా కనిపించేది. అలాంటిది మొహాలీలో జరిగిన వన్డేలో భారత బ్యాటింగ్ లైనప్ అంతా రాణించింది.
రుతురాజ్ గైక్వాడ్, శుభ్మన్ గిల్ ఇద్దరూ 70+ స్కోర్లు చేశారు. కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఇక రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా బ్యాటర్లు చెలరేగారు. ఏకంగా 399 పరుగులు చేసి ఆసీస్పై తీవ్రమైన ఒత్తిడి పెట్టారు. గిల్, అయ్యర్ ఇద్దరూ సెంచరీలతో ఆకట్టుకున్నారు. దీంతో సీనియర్లు విఫలమైనా తాము ఉన్నామనే నమ్మకాన్ని ఈ కుర్రాళ్లు కలిగించారు.