ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో భారత జట్టు ఓటమి పాలైంది. భారీ స్కోరు చేసినా కూడా దాన్ని కాపాడుకోవడంలో టీమిండియా విఫలమైంది. గువాహతి వేదికగా జరిగిన ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 222 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేజింగ్లో ఆసీస్కు ట్రావిస్ హెడ్ మంచి ఆరంభం అందించాడు.
కానీ వెంటనే పుంజుకున్న బౌలర్లు వెంట వెంటనే మూడు వికెట్లు తీసి ఆసీస్ను ఒత్తిడిలోకి నెట్టారు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన గ్లెన్ మ్యాక్స్వెల్ కేవలం 48 బంతుల్లోనే 104 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఒంటి చేత్తో ఆసీస్ను విజయతీరాలకు చేర్చాడు. ఈ ఓటమితో నాలుగో టీ20లో భారత జట్టులో చాలా మార్పులు జరిగేలా కనిపిస్తోంది.

డిసెంబరు 1న రాయ్పూర్ వేదికగా ఆసీస్, భారత్ మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులో భారత జట్టులో భారీగా మార్పులు చేయాలని టీం మేనేజ్మెంట్ అనుకుంటోందట. దానికితోడు శ్రేయాస్ అయ్యర్ కూడా జట్టుతో చేరుతున్నాడు. అతన్ని వైస్ కెప్టెన్గా కూడా నియమించనున్న సంగతి తెలిసిందే.
అతను జట్టులో చేరాలంటే టాపార్డర్లో ఎవరో ఒకరు తప్పుకోవాల్సిందే. అయితే యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్.. ముగ్గుర్నీ తప్పించడానికి మేనేజ్మెంట్ సుముఖంగా లేదు. ఈ క్రమంలో అయ్యర్ను మిడిలార్డర్లో చేర్చాలని అనుకుంటోంది. దీని కోసం తెలుగు కుర్రాడు తిలక్ వర్మను పక్కన పెట్టేయాలని డిసైడ్ అయిందట.
తిలక్ వర్మ ఒక్కడే కాదు.. బౌలర్లపై కూడా కఠిన నిర్ణయం తీసుకోవాలని టీం మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుందట. మూడో టీ20లో ధారాళంగా పరుగులిచ్చిన ప్రసిద్ధ్ కృష్ణ, ఆవేష్ ఖాన్ ఇద్దర్నీ తప్పించాలని డిసైడ్ అయిపోయింది. వీళ్లిద్దరి స్థానంలో తాజాగా పెళ్లి చేసుకొన్న ముఖేష్ కుమార్, అలాగే కొత్తగా జట్టుతో చేరిన దీపక్ చాహర్ను ఆడించనున్నట్లు తెలుస్తోంది.