తిరువనంతపురం వేదికగా జరుగుతున్న రెండో టీ20లో ఆసీస్ బౌలర్లకు భారత బ్యాటర్లు చుక్కలు చూపించారు. ఎదుర్కొన్న ప్రతి బంతికీ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన భారత బ్యాటర్లు ఎడాపెడా బౌండరీలు బాదేశారు. ముఖ్యంగా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (25 బంతుల్లో 53) చెలరేగాడు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ (52) కూడా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
మంచు కూడా పడటంతో బ్యాటర్లు మరింత సులభంగా భారీ షాట్లు ఆడేశారు. ఒకపక్క జైస్వాల్, కిషన్ చెలరేగుతుంటే అతనికి మంచి మద్దతు ఇచ్చిన రుతురాజ్ గైక్వాడ్ (58) కూడా చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. మధ్యలో సూర్యకుమార్ యాదవ్ (10 బంతుల్లో 19) వచ్చీరాగానే భారీ సిక్సర్ బాదాడు. అయితే అతను ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు.

ఇలాంటి సమయంలో ఫినిషర్గా క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్ (9 బంతుల్లోనే 31 నాటౌట్) తనదైన స్టైల్లో అద్భుతంగా ఆడేశాడు. ఇలా భారత బ్యాటర్లు అందరూ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆసీస్ బౌలర్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా భారత బ్యాటర్ల జోరకు కళ్లెం వేయలేకపోయారు.
ఆసీస్ యువ పేసర్ నాథన్ ఎల్లీస్ మూడు వికెట్లు తీసుకున్నాడు. కానీ నాలుగు ఓవర్లలో ఏకంగా 45 పరుగులు ఇచ్చాడు. ఇక గ్లెన్ మ్యాక్స్వెల్, షాన్ ఆబాట్ ఇద్దరికీ అయితే భారత బ్యాటర్లు చుక్కలు చూపించారు. మ్యాక్స్వెల్ రెండు ఓవర్లలో 38 పరుగులు ఇవ్వగా.. మూడు ఓవర్లు వేసిన ఆబాట్ ఏకంగా 56 పరుగులు సమర్పించుకున్నాడు. దానికితోడు మంచ ప్రభావంతో వాళ్లు ఎక్స్ట్రాలు కూడా భారీగా వేశారు. దీంతో ఆసీస్ ముందు భారత జట్టు 236 పరుగుల భారీ టార్గెట్ నిలిపింది.