భారత్తో మూడో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఆకట్టుకున్నారు. ముఖ్యంగా టాప్ ఫోర్ ప్లేయర్లు అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. మంచి ఫామ్లో ఉన్న డేవిడ్ వార్నర్ (56) వరుసగా మూడో మ్యాచులోనూ అర్ధశతకం సాధించాడు. అతని జోడీగా దిగిన మిచెల్ మార్ష్ (96) సెంచరీ మిస్ చేసుకున్నాడు. బ్యాటింగ్కు సహకరిస్తున్న పిచ్పై వీళ్లిద్దరూ చెలరేగారు.
ఆ తర్వాత వచ్చిన స్టీవ్ స్మిత్ (74) కూడా అద్భుతంగా ఆడాడు. మైదానం నలువైపులా షాట్లు ఆడుతూ ఆకట్టుకున్నాడు మిచెల్ మార్ష్, స్మిత్ కలిసి 131 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే రాజ్కోట్లో ఎండలు మండిపోవడంతో వీళ్లిద్దరూ బాగా అలిసిపోయారు. డబుల్స్ వచ్చే చోట కేవలం సింగిల్స్ తీస్తూ సత్తువ దాచుకున్నారు. డబుల్స్ తీయడానికి వీళ్లిద్దరూ ఇష్టపడలేదు.

ముఖ్యంగా స్మిత్ ఈ ఎండకు బాగా అలిసిపోయాడు. సింగిల్ తీసినా కూడా నాన్స్ట్రైకర్ ఎండ్లో వంగబడి ఆయాస పడుతూ కనిపించాడు. ఈ క్రమంలో డ్రింక్స్ సమయంలో తీసిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఎండ తట్టుకోలేకపోయిన స్మిత్ కోసం టీం మేనేజ్మెంట్ వాళ్లు మైదానంలోకి కుర్చీ తీసుకొచ్చారు. దానిపై కూర్చున్న స్మిత్ తలపై.. ఐస్ వేసిన కవర్ ఉంచారు.
ఇలా సేద తీరుతున్న స్మిత్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఎండలో ఎక్కువ సేపు ఉండలేకపోయిన స్మిత్.. భారీ స్కోరు చేయలేకపోయాడు. 74 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. మార్ష్ కూడా సింగిల్స్, డబుల్స్ తీయలేకనే బౌండరీ బాదబోయి అవుటయ్యాడు. చివర్లో లబుషేన్ (72) రాణించడంతో ఆస్ట్రేలియా 352 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఇక ఇలా ఎండ వేడి తట్టుకోలేకపోయిన ఆసీస్ బ్యాటర్లను చూసిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. మరీ ఇంత అలసిపోయారా? అని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ఆసీస్ బ్యాటర్లలో మార్నస్ లబుషేన్ మినహా మిగతా ఎవరూ కూడా సింగిల్స్, డబుల్స్ తీయడానికి ఇష్టపడకపోవడం గమనార్హం. ముఖ్యంగా స్మిత్, మార్ష్ జోడీ అయితే బౌండరీలతోనే పరుగులన్నీ చేశారు.
భారత బౌలర్లు కూడా చివరి పది ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఆసీస్ బ్యాటర్లు భారీ షాట్లు ఆడకుండా కట్టడి చేశారు. జస్ప్రీత్ బుమ్రా వరుసగా రెండో మ్యాచులోనూ పూర్త పది ఓవర్ల కోటా పూర్తి చేశాడు. మూడు వికెట్లతో బుమ్రా ఆకట్టుకోగా.. స్పిన్కు ఏమాత్రం సహకారం లభించకపోయినా కుల్దీప్ కూడా రెండు వికెట్లతో రాణించాడు.