ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో భారత జట్టు అద్భుతంగా ఆడింది. గువాహతి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ ఓడిన భారత జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. అయితే జట్టుకు తొలి రెండు మ్యాచుల్లో మంచి ఓపెనింగ్ అందించిన యశస్వి జైస్వాల్ (6) విఫలమయ్యాడు.
ఆ తర్వాత కాసేపటికే వరుసగా రెండు హాఫ్ సెంచరీలు బాదిన ఇషాన్ కిషన్ (0) కూడా ఐదు బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యదవ్ (39) ఇన్నింగ్సును చక్కదిద్దేందుకు ప్రయత్నించాడు.

అయితే డ్రింక్స్ బ్రేక్ ముగియగానే సూర్యకుమార్ కూడా పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (31 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. అదే సమయంలో రుతురాజ్ గైక్వాడ్ అద్భుతంగా తన ఇన్నింగ్స్ వేగం పెంచాడు.
ఆరంభంలో నెమ్మదిగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించిన గైక్వాడ్.. ఆ తర్వాత ధనాధన్ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే భారీ శతకం బాదాడు. కేవలం 57 బంతుల్లోనే 123 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. గైక్వాడ్ ఇన్నింగ్సులో 13 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. అతని బాదుడు చూసిన ఫ్యాన్స్ అంతా సంతోషంతో రెచ్చిపోయారు.
గైక్వాడ్ తన చివరి 36 బంతుల్లోనే 102 పరుగులు బాదడం గమనార్హం. గైక్వాడ్ ఇలా చెలరేగడంతో భారత జట్టు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఆసీస్ బౌలర్లు కూడా సరైన లైన్ అండ్ లెంగ్త్లో బౌలింగ్ చేయలేకపోయారు. 23 ఎక్స్ట్రాలు వేశారు.
దీంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత జట్టు కేవలం 3 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆసీస్ బౌలర్లలో కేన్ రిచర్డ్సన్, జేసన్ బెహ్రండాఫ్, ఆరోన్ హార్డీ తలో వికెట్ తీసుకున్నారు.