ఆసీస్తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 208 పరుగుల భారీ స్కోరు చేసింది. జోష్ ఇంగ్లిస్ (110), స్టీవ్ స్మిత్ (52) ఇద్దరూ అద్భుతంగా ఆడటంతో ఆసీస్కు కళ్లెం వేయడంలో భారత బౌలర్లు తడబడ్డారు. దీంతో ఆ జట్టు ఇంత భారీ స్కోరు చేసింది.
లక్ష్య ఛేదనలో భారత్కు యశస్వి జైస్వాల్ (8 బంతుల్లో 22) అదిరే ఆరంభం అందించాడు. అయితే అతను ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. రుతురాజ్ గైక్వాడ్ (0) ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే రనౌట్ అయ్యాడు. ఇలాంటి సమయంలో ఇషాన్ కిషన్ (58), సూర్యకుమార్ యాదవ్ (80) ఇద్దరూ చెలరేగారు. దీంతో టీమిండియా లక్ష్యం వైపు దూసుకుపోయింది.

చివర్లో రింకూ సింగ్ (14 బంతుల్లో 22 నాటౌట్) అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి ఒక్క పరుగు కావలసి ఉండగా.. షాన్ ఆబాట్ వేసిన ఫుల్ లెంగ్త్ డెలివరీని సిక్సర్గా మలిచాడీ స్టార్ ప్లేయర్. అయితే అది నోబాల్ కావడంతో అతని సిక్సర్ను లెక్కలోకి తీసుకోలేదు. నోబాల్తోనే భారత్ గెలిచినట్లు అంపైర్లు ప్రకటించారు.
ఇది చూసిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. అసలు ఆబాట్ కావాలనే నోబాల్ వేశాడా? అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రింకూ భారీ షాట్ ఆడేస్తాడని తెలిసి ఆబాట్ ఇలా చేశాడా? అంటున్నారు. అయితే రింకూ కనుక ఆ షాట్ మిస్ అయితే మ్యాచ్ డ్రా అయ్యేది. కాబట్టి ఆబాట్ అలా చేయాల్సిన అవసరం లేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
కొన్ని రోజుల క్రితం ఐర్లాండ్తో జరిగిన టీ20 సిరీసులో రింకూ సింగ్.. భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. తను ఆడిన తొలి మ్యాచులోనే 21 బంతుల్లో 38 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఆసియా క్రీడల్లో భాగంగా నేపాల్తో జరిగిన మ్యాచులో 15 బంతుల్లోనే 37 పరుగులతో రాణించాడు. ఇలా పొట్టి ఫార్మాట్లో టీమిండియా తరఫున ఫినిషర్గా మారుతున్నాడీ కుర్ర ప్లేయర్.
ఈ ఏడాది కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఐపీఎల్లో చెలరేగిన రింకూ సింగ్.. కొన్ని అద్భుతమైన ఇన్నింగ్సులు ఆడాడు. దీంతో అతనికి టీమిండియా పిలుపు దక్కింది. తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్న అతను.. భారత్ తరఫున మ్యాచులను అద్భుతంగా ఫినిష్ చేస్తూ దూసుకెళ్తున్నాడు.