World Cup 2023: వన్డే వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచులో మాత్రమే వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆడాడు. ఆ తర్వాత ఫైనల్ వరకు మొత్తం 10 మ్యాచులు భారత్ ఆడగా.. వాటిలో ఒక్కదానిలో కూడా అశ్విన్కు ఆడే అవకాశం దక్కలేదు. సౌతాఫ్రికాతో జరిగిన లీగ్ మ్యాచులో, అలాగే ఫైనల్లో అశ్విన్ ఆడతాడని అంతా అనుకున్నారు.
కానీ రోహిత్ మాత్రం అశ్విన్కు ఆ అవకాశం ఇవ్వలేదు. ప్రధాన స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాను కొనసాగించాడు. వీళ్లిద్దరూ ఫైనల్లో తేలిపోయారు. కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. ఈ క్రమంలో అశ్విన్ను తీసుకొని ఉండాల్సిందంటూ పలువురు మాజీలు, ఫ్యాన్స్ కూడా అభిప్రాయపడ్డారు. తాజాగా ఇలా తనకు అవకాశాలు దక్కకపోవడం గురించి అశ్విన్ మాట్లాడాడు.

రోహిత్ శర్మ ఏ ఆలోచనతో తనను ఎంపిక చేయలేదో అర్థం చేసుకున్నానని అశ్విన్ తెలిపాడు. తను రోహిత్ స్థానంలో ఉన్నా కూడా విన్నింగ్ కాంబినేషన్ను మార్చేందుకు వంద సార్లు ఆలోచించే వాడినని అంగీకరించాడు. ముఖ్యంగా ఫైనల్కు ముందు అశ్విన్ను ఆడిస్తారని వార్తలు వచ్చినా.. రోహిత్ మాత్రం ఆ ధైర్యం చేయలేదు. చివరకు మ్యాచ్ టీమిండియా ఓడిన సంగతి తెలిసిందే.
'నన్నడిగితే నేను ఫైనల్ ఆడటం, టీం కాంబినేషన్ అంతా కూడా సెకండరీనే. ముందు ఇది ఎంపతీకి సంబంధించిన విషయం. నేను ఇదే విషయాన్ని చాలాసార్లు చెప్పా. ఇతరుల స్థానంలో నిలబడి వాళ్ల ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం' అని అశ్విన్ అన్నాడు.
'నేను రోహిత్ స్థానంలో ఉంటే.. విన్నింగ్ కాంబినేషన్ను మార్చడానికి వంద సార్లు ఆలోచించేవాడిని. జట్టు అద్భుతంగా ఆడుతోంది. అలాంటప్పుడు ఒక పేసర్ను పక్కన పెట్టి మూడో స్పిన్నర్ను ఎందుకు తీసుకోవాలి?' అని ప్రశ్నించాడు. రోహిత్ ఆలోచనా విధానాన్ని తాను అర్థం చేసుకున్నట్లు పేర్కొన్నాడు.