ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో భారత జట్టు థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచులో బ్యాటుతో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రింకూ సింగ్ చెలరేగారు. దీంతో 208 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా భారత జట్టు ఈజీగా ఛేదించేలా కనిపించింది. అయితే చివరి ఓవర్లో రెండు వరుస రనౌట్లు మ్యాచ్ను థ్రిల్లింగ్గా మార్చేశాయి.
తొలి మూడు ఓవర్లలోనే ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ చేరడంతో భారత జట్టు కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 58 పరుగులు) అద్భుతంగా ఆడాడు. అయితే అతను తన ఇన్నింగ్స్ను చాలా నెమ్మదిగా ప్రారంభించాడు. వన్డే తరహాలో డాట్ బాల్స్ ఆడిన కిషన్.. చాలాసేపు అభిమానుల సహనాన్ని పరీక్షించాడు.

అయితే ఆ తర్వాత సడెన్గా విశ్వరూపం చూపించిన అతను.. ఆసీస్ స్పిన్నర్ తన్వీర్ సంఘాను టార్గెట్ చేసి ఎడాపెడా బౌండరీలు బాదేశాడు. సంఘా వేసిన రెండో ఓవర్లో తొలి మూడు బంతులకు బౌండరీలు బాదాడు. ఈ ఇన్నింగ్స్ గురించి మ్యాచ్ తర్వాత మాట్లాడిన కిషన్.. సంఘాను టార్గెట్ చేస్తానని సూర్యకు కూడా ముందే చెప్పానని వెల్లడించాడు.
'వరల్డ్ కప్లో నాకు ఆడే అవకాశం రానప్పుడు.. ప్రాక్టీస్ సెషన్ ముందు నాకు నేను ఒకటే ప్రశ్న వేసుకునే వాడిని.. ఇప్పుడు నాకు ఏది ముఖ్యం? నేను ఏం చేయగలను? అని. నెట్స్లో తీవ్రంగా శ్రమించా. మ్యాచ్ గురించి కోచ్లతో బాగా చర్చించా. ఎలా నా ఇన్నింగ్స్ను చివరి వరకు తీసుకెళ్లాలి? ఒక్కో బౌలర్ను ఎలా టార్గెట్ చేయాలి? అని అడిగేవాడిని' అని చెప్పుకొచ్చాడు.
'నేను లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి లెగ్ స్పిన్నర్ బౌలింగ్లో నాకు అడ్వాంటేజ్ ఉంటుంది. అప్పటికే 20 ఓవర్లు కీపింగ్ చేశాను కాబట్టి వికెట్ ఎలా ఉందో నాకు ఐడియా వచ్చేసింది. 209 పరుగులు ఛేజ్ చేయాలంటే ఎవరో ఒక బౌలర్ను టార్గెట్ చేయాలి. అప్పుడే సూర్య భాయ్తో మాట్లాడా. సంఘా ఎక్కడ బంతి వేసినా బాదేస్తానని చెప్పా. ఎందుకంటే రన్ రేట్ పెంచాలి కదా' అన్నాడు.
'ఇన్నింగ్స్ చివర్లో బ్యాటర్లు మరీ ఎక్కువ పరుగులు చేయాల్సి రాకూడదు. వాళ్ల ముందు ఎంత తక్కువ రన్స్ ఉంటే వాళ్లు అంత స్వేచ్ఛగా ఆడతారు. ఎక్కువ పరుగులు చేయాల్సి వస్తే రాగానే భారీ షాట్లు ఆడటం కష్టం. అందుకే నా ఛాన్సెస్ తీసుకున్నా. నాపై నేను నమ్మకం ఉంచా' అని పేర్కొన్నాడు. అయితే మ్యాచ్ చివరకు మాత్రం సంఘాదే పైచేయి అయింది. ఎందుకంటే అతను రెండు వికెట్లు తీసుకున్నాడు.