టీమిండియా యంగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీసులో తొలి రెండు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నాడు. వన్డే వరల్డ్ కప్ ఆడిన జట్టులో కూడా కిషన్ ఉన్నాడు. కానీ అతనికి ఎక్కువ అవకాశాలు దక్కలేదు.
శుభ్మన్ గిల్ డెంగీతో తొలి మూడు మ్యాచులకు దూరమవగా.. ఆ మ్యాచుల్లో మాత్రం కిషన్ ఆడాడు. గిల్ తిరిగొచ్చిన తర్వాత అతనికి ఆడే అవకాశం దక్కలేదు. చివరకు ఫైనల్లో భారత్ ఓడినప్పుడు కూడా అతను ఆడలేదు. ఈ క్రమంలో తను చాలా బాధ పడ్డానని, ఆడే అవకాశం రాలేదని చికాకు వేసిందని కిషన్ చెప్పాడు.

ఇలా టీమిండియాలో తన చోటు స్థిరంగా లేకపోవడం, జట్టులోకి వచ్చి పోతుండటంపై కిషన్ తాజాగా తన మనసులోని మాట చెప్పాడు. ఓపెనర్గా ఐపీఎల్లో చాలాకాలంగా ఆకట్టుకుంటున్న అతను.. టీమిండియాలో చోటు కోసం తన ఆటను మార్చుకొని మిడిలార్డర్ ప్లేయర్గా మారాడు. కానీ అతని స్థానం మాత్రం సుస్థిరం కాలేదు. దీనిపై కిషన్ స్పందించాడు.
'ఇదంతా నా కసి అని నేను అనుకుంటున్నా. వరల్డ్ కప్లో మేం ఒక ఛాంపియన్ జట్టులా ఆడాం. కానీ నాకు మాత్రం ఆడే అవకాశం దక్కలేదు. అది నాకు చాలా బాధగా అనిపించిన మాట వాస్తవం. కానీ ఆ సమయంలో మనం ఏమీ చేయలేం కదా. అంతర్జాతీయ క్రికెట్లో మనకు జట్టులో చోటు ఉండని స్థితి వస్తుంది' అని చెప్పాడు.
'అయితే అవన్నీ మనసులో పెట్టుకోకూడదు. ఛాన్స్ దొరికితే మళ్లీ ఫ్రెష్ మైండ్ సెట్తో బరిలో దిగాలి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ అవకాశం చేజారకుండా చూసుకోవాలి.' అని కిషన్ చెప్పుకొచ్చాడు. ఇదే పద్ధతిని ఫాలో అయిన కిషన్ వరుసగా రెండు హాఫ్ సెంచరీలతో ఆసీస్పై సత్తా చాటాడు.