ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఘనవిజయం సాధించింది. మొహాలీ వేదికగా జరిగిన ఈ మ్యాచులో వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కేవలం 51 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. ఈ క్రమంలో 16 ఏళ్ల తర్వాత స్వదేశంలో ఐదు వికెట్లు తీసుకున్న భారత పేసర్గా రికార్డు సృష్టించాడు. గతంలో జహీర్ ఖాన్ ఈ ఘనత సాధించాడు.
ఆ తర్వాత బ్యాటర్లు కూడా అద్భుతంగా రాణించారు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ మినహా మిగతా బ్యాటర్లు హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. దీంతో భారత్ ఘన విజయం సాధించి వన్డేల్లో టాప్ ర్యాంకు సాధించింది. ఈ క్రమంలో వన్డేల్లో నెంబర్ వన్గా ఉన్న పాకిస్తాన్ను రెండో స్థానానికి నెట్టేసింది. ఇదే జోరును ఇండోర్ వేదికగా జరిగే రెండో వన్డేలో కూడా చూపించాలని టీమిండియా భావిస్తోంది.

రెండో వన్డే కూడా నెగ్గి సిరీసును మరో మ్యాచ్ మిగిలుండగానే తమ ఖాతాలో వేసుకోవాలని కేఎల్ రాహుల్ భావిస్తున్నాడు. దానికితోడు ఈ మ్యాచ్ జరిగేది హోల్కర్ స్టేడియంలో. ఇక్కడ ఇప్పటి వరకు భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. దీంతో ఇదే సెంటిమెట్ వర్కవుట్ అయితే ఇక్కడే సిరీస్ భారత్ కైవసం అవుతుందని ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు.
ఇక పిచ్ విషయానికొస్తే.. హోల్కర్ స్టేడియం బ్యాటర్లకు స్వర్గధామం. ఇక్కడ ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు భారీ స్కోరు చేసే అవకాశం ఉంది. హోల్కర్ స్టేడియంలో చివరగా ఆడిన మ్యాచులో న్యూజిల్యాండ్పై భారత జట్టు ఏకంగా 385 పరుగులు చేసింది. కివీస్ కూడా గట్టి పోటీ ఇచ్చింది కానీ.. చివరకు 90 పరుగుల తేడాతో ఓడింది. అయితే ఇక్కడ ఛేజింగ్ టీమ్స్కు కూడా మంచి చరిత్రే ఉంది. స్లో బౌలర్లు జట్టు విజయాన్ని నిర్దేశించే అవకాశం ఉంది.
ఇండోర్లో మ్యాచ్ జరిగే ఆదివారం నాడు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మ్యాచ్ ఆరంభానికి ముందు అంటే ఉదయం ఇక్కడ భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఆ తర్వాత సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడొచ్చని వార్నింగ్ ఇచ్చింది. మిగతా సమయంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది.