ఆసీస్తో జరుగుతున్న మూడో వన్డేలో భారత బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. బ్యాటింగ్కు పూర్తిగా సహకరిస్తున్న రాజ్కోట్ పిచ్పై ఆస్ట్రేలియాకు అదిరే ఆరంభం దక్కింది. స్టార్ ప్లేయర్లు డేవిడ్ వార్నర్ (56), మిచెల్ మార్ష్ (96) ఇద్దరూ ఎడాపెడా బౌండరీలు బాదేశారు. ఏకంగా ఓవర్కు 10 వరకు పరుగులు పిండుకున్నారు. దీంతో ఆ జట్టు 400 స్కోరు చేస్తుందేమో అని అంతా అనుకున్నారు.
అయితే ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో వార్నర్ అవుటయ్యాడు. కానీ స్టీవ్ స్మిత్ (74) కూడా ఆకట్టుకున్నాడు. కుల్దీప్ బౌలింగ్లో సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో మార్ష్ అవుటయ్యాడు. ఆ తర్వాత మార్నస్ లబుషేన్ (72) కూడా చెలరేగాడు. కాకపోతే ఆ తర్వాత వచ్చిన అలెక్స్ క్యారీ (11), గ్లెన్ మ్యాక్స్వెల్ (5), కామెరూన్ గ్రీన్ (9), ప్యాట్ కమిన్స్ (19 నాటౌట్), మిచెల్ స్టార్క్ (1 నాటౌట్) పెద్దగా పరుగులు చేయలేదు.

టాపార్డర్ అందరూ హాఫ్ సెంచరీలు చేయడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. సిరాజ్ వేసిన చివరి ఓవర్ చివరి బంతికి మరో వికెట్ పడాల్సింది. అతను వేసిన షార్ట్ బాల్ను ఆడటంతో కమిన్స్ తడబడ్డాడు. దీంతో ఎడ్జ్ తీసుకున్న బంతి కీపర్ రాహుల్ వైపు వెళ్లింది. అయితే అది కొంచెం ముందుకు వచ్చింది. డైవ్ చేసినా కూడా దాన్ని రాహుల్ అందుకోలేకపోయాడు.
ఆరంభంలో తేలిపోయిన భారత బౌలర్లు చివర్లో అద్భుతంగా పుంజుకున్నారు. 25 ఓవర్లకే 200 వరకు స్కోరు చేసిన ఆస్ట్రేలియాను చాలా కట్టడి చేశారు. ఈ క్రమంలో జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లతో చెలరేగాడు. పిచ్ నుంచి ఏమాత్రం సహకారం లేకపోయినా కుల్దీప్ యాదవ్ 2 వికెట్లతో ఆకట్టుకున్నాడు. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో వికెట్ తీసుకున్నారు.