ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్కు ఆసీస్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ గట్టి షాకిచ్చాడు. రాజ్కోట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ కమిన్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. బ్యాటింగ్కు పూర్తిగా సహకరిస్తున్న ఈ పిచ్పై ఆసీస్ టాపార్డర్ చెలరేగింది.
వరుసగా నలుగురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలు సాధించడంతో ఆ టీం ఏకంగా 352 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో అనూహ్యంగా వాషింగ్టన్ సుందర్ (18) ఓపెనర్గా వచ్చాడు. అతనికి జోడీగా వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ (81) అద్భుతంగా ఆడాడు. ధనాధన్ షాట్లతో ఆసీస్ బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. మ్యాక్స్వెల్ బౌలింగ్లో సుందర్ అవుటైన తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ కూడా చక్కగా ఆడుతున్నాడు.

ముఖ్యంగా రోహిత్పై ఒత్తిడి పడకుండా కోహ్లీ వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. ఇది చూసిన ఫ్యాన్స్ అంతా కూడా రోహిత్ ఈజీగా సెంచరీ చేసుకుంటాడని అనుకున్నారు. ఇలాంటి సమయంలో మరోసారి మ్యాక్స్వెల్ బౌలింగ్కు వచ్చాడు. మ్యాక్స్వెల్ వేసిన ఒక బంతిని భారీ సిక్సర్ బాదిన రోహిత్ మంచి టచ్లో కనిపించాడు. అయితే అదే ఓవర్లో మరో స్ట్రెయిట్ షాట్ ఆడేందుకు రోహిత్ ప్రయత్నించాడు.
ఈ క్రమంలో మ్యాక్స్వెల్ వైపు బంతి దూసుకొచ్చింది. సడెన్గా మొఖం మీదకు వచ్చేసిన బంతిని మ్యాక్స్వెల్ చటుక్కున పట్టేశాడు. ఈ క్యాచ్ తను అందుకున్నానని మ్యాక్సీనే నమ్మలేకపోయాడు. మిగతా టీంమేట్స్ కూడా దీన్ని నమ్మలేక నవ్వుతూ వచ్చి అతనికి కంగ్రాట్స్ చెప్పారు. దీంతో రోహిత్ తన సెంచరీ పూర్తి చేసుకోకుండానే పెవిలియన్ చేరాల్సి వచ్చింది.
ఈ స్టన్నింగ్ క్యాచ్ చూసిన ఫ్యాన్స్ కూడా దీన్ని నమ్మలేకపోతున్నారు. సరిగ్గా మ్యాక్స్వెల్ తన కుడిచెయ్యి పెట్టిన దగ్గరకే బంతి దూసుకురావడం కచ్చితంగా రోహిత్ దురదృష్టం అని బాధ పడుతున్నారు. లేదంటే ఈ బ్యాటింగ్ పిచ్పై రోహిత్ మరో డబుల్ సెంచరీ చేసేవాడని ఫ్యాన్స్ అంటున్నారు. ఏదేమైనా మంచి సెంచరీ చేసుకునే ఛాన్స్ రోహిత్ మిస్ చేసుకోవడం మాత్రం వాస్తవం.